Panchayat Polls : ఏపిలో నాల్గవ దశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. పంచాయతీ ఎన్నికల చివరి దశలో 13 జిల్లాల్లోని 161 మండలాల్లో పోలింగ్ ఉదయం 6.30 గంటలకు ప్రారంభం కాగా ఓటర్లు కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 3.30 గంటల వరకూ పోలింగ్ జరగుతుంది. అనంతరం సాయంత్రం 4గంటల నుండి ఓట్ల లెక్కింపు చేసి ఫలితాలను వెల్లడిస్తారు.
నాల్గవ విడతలతో 3,299 గ్రామ పంచాయతీల సర్పంచ్ స్థానాలకు గానూ 554 పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. 2,743 సర్పంచ్ స్థానాలకు 7,475 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 33,435 వార్డులకు 10,921 స్థానాలు ఏకగ్రీవం కాగా 91 వార్డులకు నామినేషన్ లు దాఖలు కాలేదు. 22,514 వార్డు స్థానాలకు 52,700 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఈ రోజు పోలింగ్ లో 67,75,226 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. సాయంత్రం ఓట్ల లెక్కింపు విడియో చిత్రీకరించనున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద విస్తృత బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద నడవలేని వృద్ధులు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుుక పోలీస్ సిబ్బంది సహయం చేస్తున్నారు.