Panchayati : ఏపిలో గ్రామ పంచాయతీ తొలి విడత ఎన్నికల ప్రక్రియలో ఒక ఘట్టం పూర్తి అయ్యింది. మొత్తం నాలుగు దశలో ఎన్నికల్లో జరుగుతుండగా మొదటి విడత ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. తొలి విడత పోలింగ్ ఫిబ్రవరి 9వ తేదీన జరగనున్నది. చెదురు మదురు సంఘటనలు మినహా తొలి విడత నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రశాంతంగానే ముగిసింది. పలు గ్రామాల్లో ప్రత్యర్థులను నామినేషన్ లు వేయకుండా అడ్డుకున్న సంఘటనలు జరిగినట్లు వార్తలు వచ్చాయి. అత్యధిక గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు బలపర్చిన అభ్యర్థులు తమ తమ నామినేషన్ లు దాఖలు చేశారు.
ఇదిలా ఉండగా ఈ సారి పోటీ చేసే అభ్యర్థులకు కొత్త భయం పట్టుకుంది. సహజంగా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుడి ఎన్నికల్లో అభ్యర్థులకు ప్రతి ఓటూ కీలకమే. గ్రామాల్లో అధిపత్యం కోసం కొన్ని గ్రామాల్లో ఎంత ఖర్చు చేయడానికైనా నాయకులు వెనుకాడరు. ఇప్పటికే పలు గ్రామాల్లో సర్పంచ్ పదవికి వేలం పాటలను నిర్వహించగా ఓ గ్రామంలో రూ. 62 లక్షలు, మరో గ్రామంలో 60లక్షలు, ఊంకో గ్రామంలో రూ. 32 లక్షలకు సర్పంచ్ పదవి ఆశిస్తున్న నాయకులు పాడుకున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలు పార్టీల రహితంగా జరుగుతాయని పేరే గానీ ఆయా రాజకీయ పార్టీల నేతలు అభ్యర్థులను బలపర్చి వారి గెలుపునకు ప్రచారం చేస్తుంటారు.
ఏపి పంచాయతీ ఎన్నికల్లో తొలి సారిగా నోటా గుర్తును బ్యాలెట్ పేపరుపై ముద్దించనున్నారు. ఇదే ఇప్పుడు అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తుంది. ఇంతకు ముందు పలు ప్రాంతాల్లో జరిగిన ఎన్నికల్లో నోటాకు పోల్ అయిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావం చూపాయి. ఇది తలుచుకునే అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. 2019 జనవరిలో తెలంగాణలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో, ఇటీవల గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) ఎన్నికల్లోనూ నోటా ఓటు ముద్దించారు. పోటీలో ఉన్న అభ్యర్థులు ఎవరూ నచ్చకపోతే ఓటరు నోటా ఓటు వేస్తుంటారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో అయిదారు డివిజన్ లలో నోటాకు వచ్చిన ఓట్లు అభ్యర్థుల గెలుపు ఓటములపై ప్రభావితం చూపాయి. విజయం సాధించిన అభ్యర్థులు మెజార్టీ కంటె నోటాకు ఎక్కవ ఓట్లు పోల్ అయిన ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు ఇదే అభ్యర్థులకు భయంగా మారుతోంది.