PAVAN KALYAN: అందరూ ఊహిస్తున్నట్లుగానే రాబోయే ఎన్నికల నాటికి పాత పొత్తులతోనే జనసేన, బీజేపీ ప్రయాణం చేస్తాయన్నట్లుగా పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ విషయం తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగం ఆ విధంగానే కనబడుతోంది. రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఏమాత్రం లేని బీజేపీతో ప్రయాణం చేయడం వల్ల అధికార వైసీపీని దెబ్బకొట్టడం కష్టమే అన్నది సాధారణ ప్రజానీకంతో పాటు పవన్ కూ తెలుసు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో టీడీపీతో లోపాయికారీ పొత్తు పెట్టుకోవడం వల్ల జనసేన చెప్పుకోదగిన ఎంపీటీసీ స్థానాలు కైవశం చేసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల అనంతరం తొలి సారిగా మంగళగిరి పార్టీ కార్యాలయంలో బుధవారం పార్టీ కార్యకర్తల సమావేశంల జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన ప్రసంగతం గత ప్రసంగాలకు భిన్నంగా సాగింది. ఉద్రేకంతో, ఆవేశంతో కాకుండా సాధారణ రీతిలో రాబోయే ఎన్నికలలో జనసేన అధికారం సాధిస్తుంది అన్న ధీమాతో కార్యకర్తలకు భరోసా ఇచ్చేలా పవన్ కల్యాణ్ ప్రసంగం సాగింది.
PAVAN KALYAN: ఓటు బ్యాంకు రాజకీయం కోసమే ఉచిత పథకాలు
ఈ సమావేశంలో వైసీపీ ప్రభుత్వ పాలన తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శించిన పవన్ కల్యాణ్.. ప్రస్తుత ప్రభుత్వం ప్రజాభీష్టానికి భిన్నంగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కేవలం కమ్మ సామాజిక వర్గం టార్గెట్ చేస్తూ పాలన సాగిస్తుందని ఆరోపించారు. రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ పాలన తీరును ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకువెళుతున్నామని అన్నారు. సగటు ప్రజలపై ప్రభుత్వం పెద్ద ఎత్తున భారాలు మోపుతోందని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు అప్పులు తీసుకువస్తూ ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఉచిత నగదు పథకాలు అమలు చేస్తున్నదని దుయ్యబట్టారు. ఈ పర్యవసానంగా రాష్ట్రాన్ని ఆర్థిక సంక్షోభంలోకి నెట్టివేశారని పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read More: Janasena x Ysrcp: జగన్ ఇంటికెళ్లి కొడతారట..!? జనసేన X వైసీపీ గొడవ పీక్స్..!?
అధికారం రెండు కులాలకే పరిమితమా
సెక్యూలరిజం అంటే అన్ని మతాలను సమాన దృష్టితో చూడడమే అని అన్న పవన్ కల్యాణ్.. హిందూ దేవాలయాలపై దాడులను ఖండిస్తే మిగతా మతాల వారు ఎందుకు బాధపడుతున్నారని ప్రశ్నించారు. తాము మొదటి నుండి చెబుతున్నట్లు సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్నానన్నారు. రాష్ట్రంలో కేవలం రెండు కులాలే అధికారాన్ని అనుభవిస్తుంటే మిగతా అణగారిన కులాలకు అధికారం ఎప్పుడు వస్తుందని ప్రశ్నించారు. అందుకే అధికారానికి దూరంగా ఉన్న ఇతర కులాలన్నింటినీ ఐక్యం చేసి పోరాడడమే జనసేన పార్టీ లక్ష్యమని పేర్కొన్నారు పవన్ కల్యాణ్. అధికారం ఏ రాజకీయ పార్టీకి శాశ్వతం కాదన్న విషయం అధికార యంత్రాంగం గుర్తుంచుకోవాలన్నారు. ఇక వైసీపీని అధికారం నుంచి దించుతామన్న లక్ష్యంతో కార్యకర్తలు ఇప్పటి నుండే మొక్కవోని దీక్షతో కృషి చేయాలని పవన్ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో ఇప్పటి వరకూ జనసేన శ్రేణులపై అధికార వైసీపీ చేస్తున్న దాడులను గుర్తు పెట్టుకొని అంతకంతకు రాబోయే కాలంలో బదులిస్తుందని పవన్ హెచ్చరించారు.