Pawan Kalyan: రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తొంది. సామాన్యులు మొదలు కొని ప్రముఖులు, సెలబ్రిటీలు కరోనా బారిన పడుతున్నారు. మరో పక్క పలు ప్రాంతాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా సోకి ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పిల్లలను పాఠశాలలకు పంపాలంటే తల్లిదండ్రులు భయపడుతున్నారు. వివిధ రాష్ట్రాల్లో పదవ తరగతి పరీక్షలను రద్దు చేశారు. సీబీఎస్ఈ పదవ తరగతి పరీక్షలను రద్దు చేసి ఇంటర్ పరీక్షలను వాయిదా వేసింది. ఏపిలోనూ పదవ తరగతి పరీక్షలను రద్దు చేయాలన్న డిమాండ్ వస్తోంది. అయినప్పటికీ రాష్ట్రంలో మాత్రం టెన్త్, ఇంటర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
కరోనా విజృంభణతో రాష్ట్ర ప్రజలు తీవ్ర భయాందోళనలో ఉంటే ప్రభుత్వం మాత్రం తాను పట్టిన కుందేలుకు మూడే కాళ్లు అన్నట్లుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికే అనేక మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడ్డారని ఆందోళన వ్యక్తం చేసిన పవన్ కల్యాణ్..రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ పరీక్షలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నిత్యం వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదు అవుతుంటే ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పరీక్షలు నిర్వహిస్తే విద్యార్థుల ద్వారా వైరస్ మరింత వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని పవన్ హెచ్చరించారు.
పరీక్షల నిర్వహణ విషయంలో ప్రభుత్వం సమర్థించుకున్న తీరు హస్యాస్పదంగా ఉందన్నారు. రాష్ట్రంలో 16 లక్షల మంది టెన్త్, ఇంటర్ విద్యార్థులు ఉన్నారనీ వీరు కరోనా బారిన పడితే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. పదవ తరగతి పరీక్షలు నిర్వహించకపోతే ఆర్మీ ఉద్యోగాలు నష్టపోతారని అనడం అర్దరహితమన్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం సీబీఎస్ఈ పదో తరగతి పరీక్షలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పరీక్షల విషయంలో తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా ఏపి కూడా నిర్ణయం తీసుకోవాలని పవన్ కోరారు. ఈ విషయంపై మొన్న టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం వైఎస్ జగన్ కు లేఖ రాయగా దాన్ని పట్టించుకోలేదు. ఇప్పుడు పవన్ కల్యాణ్ సూచనలపై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో, అధికార వైసీపీ నేతలు ఏమంటారో చూడాలి మరి.
కరోనా ఉధృతిలో 10వ తరగతి పరీక్షలు నిర్వహణ రాష్ట్ర ప్రభుత్వ మూర్ఖత్వమే – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/CCHi3bdqX3
— JanaSena Party (@JanaSenaParty) April 20, 2021