బీజేపీ , జనసేన పార్టీలు మిత్రపక్షాలనే సంగతి తెలిసిందే. ఎన్నికలు ముగిసిన తర్వాత జనసేనాని పవన్ కళ్యాణ్ తనంత తానుగా బీజేపీకి మద్దతు ప్రకటించారు. ఇలాంటి సమయంలో బీజేపీ రథసారథి , ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాటలను జనసేనాని పవన్ కళ్యాణ్ వల్లె వేయాలి. కానీ తాజాగా సీన్ రివర్స్ అయింది. పవన్ కళ్యాణ్ పాపులర్ డైలాగ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు.
మోడీ ఏమన్నారంటే…
గుజరాత్ లోని రాజ్ కోట్ లో ఎయిమ్స్ ఆసుపత్రికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ మనం కంటికి కనిపించని శత్రువుతో పోరాటం చేస్తున్నామని పవన్ కళ్యాణ్ కు చెందిన ఓ సినిమా డైలాగ్ ప్రస్తావించారు. కొత్త సంవత్సరంలో కరోనా మహమ్మారికి చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ అందుబాటులోకి రాబోతుందని, ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ఇండియాలో ప్రారంభం కాబోతున్నట్టు ప్రధాని మోడీ ప్రకటించారు. ఇండియాలో తయారైన వ్యాక్సిన్లు అందుబాటులోకి రానున్నాయని, వ్యాక్సిన్ తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండాలని కరోనా నిబంధనలు పాటించాలని మోడీ పేర్కొన్నారు. ప్రపంచ మెడికల్ హబ్ గా ఇండియా మారుతున్నట్టు మోడీ తెలిపారు. ఇండియాలో మెరుగైన వైద్యం, మెడిసిన్ విద్య లభిస్తోందని తెలిపారు.
ఇంతకీ టీకా ఎప్పటి నుంచో….
మరోవైపు కరోనా వ్యాక్సిన్ పై అందరి దృష్టి పడింది. అయితే, కేంద్రం ఇందుకు ఏర్పాట్లు చేస్తోంది. జనవరి 2 నుంచి దేశంలోని అన్ని రాష్ట్రాల్లో మాక్ డ్రిల్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మాక్ డ్రిల్ తరువాత దేశంలో వ్యాక్సిన్ పంపిణి ఉంటుంది. ఇటీవలే కేంద్రం దేశంలోని నాలుగు రాష్ట్రాల్లో డ్రైరన్ ను నిర్వహించింది. నాలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన ఈ డ్రైరన్ సక్సెస్ కావడంతో ఇప్పుడు దేశవ్యాప్తంగా మాక్ డ్రిల్ ను నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నది. ఈ మేరకు అన్ని రాష్ట్రాలకు హైలెవల్ కమిటీ నుంచి సమాచారం అందింది.
టీకాల సంగతి ఏంటి?
భారతదేశంలో అందించేందుకు కోవిషీల్డ్, భారత్ బయోటెక్ కోవాగ్జిన్, ఫైజర్ టీకాలు అత్యవసర అనుమతుల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నాయి. ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన టీకాకు యూకే ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసిన సంగతి తెలిసిందే. జనవరి 4 నుంచి యూకేలో ఈ టీకా అందుబాటులోకి వస్తుంది. కాగా, కోవిషీల్డ్, కోవాగ్జిన్, ఫైజర్ టీకాలకు పై నేడో రేపో డీజీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.