Pawan Kalyan: నిన్న గుంటూరు వికాస్ నగర్ లో చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమం జరగడం తెలిసిందే. జనతా వస్త్రాలు మరియు ఈ చంద్రన్న కానుక పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నేతలు చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ కార్యక్రమంలో ముగ్గురు మరణించడం జరిగింది. అంతకుముందే చంద్రబాబు నిర్వహించిన రోడ్డు షో నెల్లూరు జిల్లా కందుకూరులో 8 మంది మరణించడం..మళ్ళీ ఇప్పుడు ముగ్గురు మరణించడంతో..టీడీపీ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తన పొలిటికల్ మైలేజ్ కోసం చంద్రబాబు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నట్లు ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు.
అయితే నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించకపోవడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. పరిస్థితి ఇలా ఉంటే గుంటూరు ఘటనపై కూడా చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించడం లేదని విమర్శలు వస్తున్న క్రమంలో తాజాగా పవన్ స్పందించారు. చంద్రన్న కానుకల పంపిణీ కార్యక్రమంలో ఇలా జరగటం దురదృష్టకరమని ముగ్గురు పేద మహిళలు చనిపోవడం బాధ కలిగించిందని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల విషయంలో నిర్వాహకులు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. పోలీసులు కూడా తగిన భద్రత కల్పించాలని పవన్ కళ్యాణ్ సూచించారు. అయితే ఈ ప్రకటనలో ఎక్కడా కూడా చంద్రబాబుని విమర్శించకపోవడం పట్ల పవన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే గుంటూరు తొక్కిసలాట ఘటనలో ఉయ్యూరు శ్రీనివాస్ నీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఏ1గా ఉన్న శ్రీనివాస్ నీ విజయవాడలోని ఏలూరు రోడ్డులో గల ఓ హోటల్ లో అదుపులోకి తీసుకుని గుంటూరుకు పోలీసులు తరలించడం జరిగింది. చంద్రబాబు సభలలో వరుసగా రెండు ఘటనలలో సామాన్యులు చనిపోవడంతో తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. 30 వేలమంది మహిళలకు చీరలు పంపిణీ చేస్తామని చెప్పి ఐదుగురికి పంపిణీ చేసి ఒక్కసారిగా ఆపేయడంతో తోపులాట తొక్కిసలాట జరగటంతో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.