Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై మరో సారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అంటూ చేసిన కీలక వ్యాఖ్యలతో ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో పొత్తు అంశంపై పరోక్ష సంకేతాలు ఇచ్చారు. తాజాగా మరో సారి అలాంటి వ్యాఖ్యలనే పవన్ కళ్యాణ్ చేశారు. కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా ఆదివారం పవన్ కళ్యాణ్ ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించారు. మృతి చెందిన కౌలు రైతు కుటుంబాలకు లక్ష వంతున సాయం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నంద్యాలలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా ఉందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భధ్రతలు మరింత క్షీణించాయని పవన్ కళ్యాణ్ విమర్శించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై వైసీపీ పెద్దలు మాట్లాడుతున్న తీరును తప్పుబట్టారు.
Pawan Kalyan: రాష్ట్రాన్ని రక్షించాలంటే..
రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి అంటే ప్రత్యామ్నాయ పాలన అవసరం అని స్పష్టం చేశారు. రాష్ట్రాన్ని రక్షించాలంటే వైసీపీ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి మరల వైసీపీ ప్రభుత్వం ఏర్పడితే రాష్ట్రం అంధకారంలోకి వెళుతుందని అన్నారు. ఏపి భవిష్యత్తు కోసం చాలా మంది కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు. ఓట్లు చీలిపోతే ప్రజలకు నష్టం జరుగుతుందన్నారు. పొత్తులపై చర్చలు అవసరమని అన్నారు. బీజేపీతో జనసేన పొత్తులో ఉందనీ, బీజేపీతో తమ సంబంధాలు అధ్బుతంగా ఉన్నాయన్నారు. మోడీ, అమిత్ షా అంటే తనకు గౌరవం ఉందన్నారు. రోడ్ మ్యాప్ పై సరైన సమయంలో స్పందిస్తామని, పొత్తు ఏదైనా ప్రజలకు ఉపయోగపడాలని అన్నారు. తన వ్యక్తిగత లాభం కోసం ఎప్పుడూ పొత్తు పెట్టుకోలేదన్నారు.
దేశంలో ఎమర్జెన్సీ సమయంలో అన్ని పార్టీలు ఏకమై కాంగ్రెస్ కు ఎదురొడ్డి నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాష్ట్ర భవిష్యత్తు కోసం కొన్ని త్యాగాలకు సిద్దమని వ్యాఖ్యానించిన నేపథ్యంలో పవన్ నోటి వెంట కూడా అలాంటి వ్యాఖ్యలే రావడంతో ఏపి రాజకీయ వర్గాల్లో పొత్తులపై క్లారిటీ వస్తున్నట్లేనని చర్చ జరుగుతోంది.