Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ .రాజకీయంగా ఓ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకూ జనసేన ఏపి రాజకీయాల వరకే పరిమితమైన సంగతి తెలిసిందే. గడచిన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో అభ్యర్ధులను బరిలోకి దింపుతామని ప్రకటన చేసినప్పటికీ బీజేపీ పెద్దల అభ్యర్థనలతో చివరి నిమిషంలో పోటీ నుండి తప్పుకున్నారు. అయితే ఇకపై తెలంగాణలో జరగబోయే ప్రతి ఎన్నికల్లోనూ జనసేన పోటీ చేస్తుందని చెప్పారు పవన్ కళ్యాణ్. శుక్రవారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పర్యటించిన పవన్ కళ్యాణ్ తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తామనీ, ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటన తెలంగాణలోని పవన్ అభిమానుల సంతోషాన్ని నింపుతున్నా రాజకీయ వర్గాల్లో కొత్త సందేహాన్ని రేకెత్తిస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on
Pawan Kalyan: ఏపీలో టీడీపీతో పొత్తుకు పవన్ ‘సై’.. ఏపీ బీజేపీ ‘నై’..?
ఇప్పటికే జనసేన పార్టీ ఏపిలో బీజేపీతో ప్రయాణం చేస్తొంది. ఏపిలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని ప్రకటన చేయడం ద్వారా టీడీపీతో కలిసి ఎన్నికల్లో ప్రయాణం చేయనున్నామన్న హింట్ ఇచ్చారు. టీడీపీతో పొత్తుకు జనసేన సై అంటుంటే ఏపి బీజేపీ నేత సోము వీర్రాజు నై నై అంటున్నారు. జనసేనతోనే బీజేపీ పొత్తు, టీడీపీతో మాకు కలవదు అని సోము సారు పదే పదే చెప్పేస్తున్నారు. ఈ అంశంలో అవసరమైతే కేంద్ర బీజేపీ పెద్దలతో మాట్లాడతానంటున్నారు పవన్ కళ్యాణ్. ఏపిలో బీజేపీ – జనసేన పొత్తు అనే మాటే గానీ కలిసి కార్యక్రమాలు నిర్వహిస్తున్న దాఖలాలు లేవు. ఉమ్మడి ప్రణాళికతో వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ముందుకు సాగుతామని గతంలో ఓ సారి ప్రకటన అయితే ఇచ్చారు గానీ కలిసి కార్యక్రమాలు నిర్వహించడం లేదు.
Pawan Kalyan: తెలంగాణాలోనూ జనసేన పోటీ
ఇప్పుడు తాజాగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి కార్యకర్తలు ఉత్సాహంగా పని చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. తెలంగాణలో రాబోయే అన్ని ఎన్నికల్లో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడంతో రాజకీయ వ్యూహం ఏమైనా ఉందా..? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ వ్యూహాలను సిద్ధం చేసుకుని అమలు చేస్తొంది. ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధికార టీఎస్ఎస్ పై దూకుడుగా వ్యవహరిస్తూ రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా బండి సంజయ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలను, పార్టీ బలోపేతంకై తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తున్నారు.
Pawan Kalyan: వ్యూహంలో భాగమేనా..?
కాంగ్రెస్ పార్టీ కూడా అధికారమే లక్ష్యంగా దూకుడుగా వ్యవహరిస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మద్య త్రిముఖ పోటీ ఉండగా షర్మిల నేతృత్వంలోని వైఎస్ఆర్ టీపీ, రిటైర్డ్ సివిల్ సర్వీస్ అధికారి ప్రవీణ్ కుమార్ నేతృత్వంలో బీఎస్పీలకు తోడు జనసేన కూడా పోటీ రంగంలో నిలిస్తే బహుముఖ పోటీ అవుతుంది. బహుముఖ పోటీ జరిగితే అది అధికార పార్టీకే అడ్వంటేజ్ గా మారుతుందని అందరికీ తెలుసు. అయితే బీజేపీతో కటీఫ్ చెప్పేందుకే పవన్ కళ్యాణ్ తెలంగాణలో అడుగుపెడుతున్నారా..? లేక ఆంధ్ర ప్రదేశ్ లో బీజేపీ తన మాట వినేందుకు రాజకీయ వ్యూహంలో భాగంగా ప్రకటన చేశారా..? అనేది తేలాలి అంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇటీవల పవన్ కళ్యాణ్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సభలో మాట్లాడుతూ రాజకీయాల్లో వ్యూహాలే ఉంటాయని పేర్కొన్నారు. సో..ఇది కూడా రాజకీయ వ్యూహాల్లో ఓ భాగమేనా అనేది మరి కొద్ది రోజుల్లో తేలుతుంది.