Pawan Kalyan :జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ , ఆయన పార్టీ నేతలు తెలుసుకోవాల్సిన అంశం ఇది. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని ప్రకటించిన ఈ నేత ఇప్పుడు ఆ పని చేయాలని ఆంధ్రులు కోరుతున్నారు. రోడ్డెక్కి ప్రశ్నించే పరిస్థితిలో లేకపోయినా కనీసం గలం విప్పాలని విన్నవిస్తున్నారు. ఇదంతా విశాఖ ఉక్కు గురించి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం ప్రకటనతో విశాఖలో ఉక్కు కార్మికులు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు. ఇప్పుడు ఏపీలో విశాఖ ఉక్కు … ఆంధ్రుల హక్కు అంటూ సాగరతీరంలో ఉద్యమ నినాదాలు హోరెత్తుతున్నాయి. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ పేరు సైతం అలాగే వార్తల్లో నిలుస్తోంది.
విశాఖలో ఇది పరిస్థితి….
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రకటన నేపథ్యంలో కూర్మన్నపాలెం స్తూపం ఎదుట నెల రోజులుగా దీక్షలు కొనసాగుతున్నాయి. విశాఖలో నిర్వాసితుల నిరాహారదీక్షకు విపక్షాలు, విద్యార్థి, ప్రజాసంఘాల మద్దతు పెరుగుతోంది. ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని ఆయా సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. నెల రోజులుగా ఉవ్వెత్తున సాగుతున్న ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట వేదిక ప్రత్యేక కార్యాచరణతో సిద్ధమైంది. మార్చి 15న రైల్వే స్టేషన్లు, కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆందోళనలు చేపట్టనున్నారు. ఉక్కు ఉద్యమానికి మద్దతుగా మార్చి 15, 16న బ్యాంకు ఉద్యోగుల విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. మార్చి 17న జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఉద్యోగులు, మార్చి 18న సమ్మె చేయనున్నారు. కేంద్రం నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు…ఉద్యమం కొనసాగుతుందని కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
గంటా కీలక వ్యాఖ్యలు
రాజీనామాలతోనే కేంద్రంపై ఒత్తిడి తీసుకురాగలమని టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉక్కు కోసం 25 మంది ఎంపీలు, 175 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. విశాఖ ఉక్కు తెలుగువాడి ఆత్మగౌరవమని, స్టీల్ప్లాంట్ పరిరక్షణకు సీఎం జగన్ బాధ్యత తీసుకోవాలని అన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు . దీంతో ఉక్కు పోరాటం విషయంలో పవన్ కళ్యాణ్ సీరియస్నెస్ మళ్లీ చర్చనీయాంశంగా మారింది.