Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్ కౌలు రైతు భరోసా యాత్ర సత్యసాయి జిల్లా నుండి ప్రారంభించారు. ఆర్ధిక ఇబ్బందులతో రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు లక్ష రూపాయల వంతున సాయం అందించాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో భాగంగా ఇటీవల రూ.5 కోట్లను జనసేన పార్టీకి పవన్ కల్యాణ్ అందజేశారు. బాధిత కుటుంబాలను పరామర్శించి వారికి లక్ష రూపాయలు క్కులు అందజేసే కార్యక్రమాన్ని కౌలు రైతు భరోసా యాత్రగా నేడు చేపట్టారు. ఈ ఉదయం పట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న పవన్ కల్యాణ్ కు జనసేన కార్యకర్తలు అభిమానులు, ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన అక్కడ నుండి శ్రీసత్యసాయి జిల్లా కొత్త చెరువు విజయనగర్ కాలనీకి చేరుకున్నారు. అప్పుల బాధతో మృతి చెందిన రామకృష్ణ కుటుంబాన్ని పవన్ పరామర్శించారు. రామకృష్ణ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్కును జనసేన తరపున అందజేశారు.
Pawan Kalyan: 28 మంది కౌలు రైతు కుటుంబాలకు
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ..కౌలు రైతు కుడటుంబాలకు జనసేన అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. రామకృష్ణ కుటుంబ సభ్యులతో మాట్లాడిన పవన్..కౌలు రైతు కష్టాలు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పవన్ వెంట జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యుడు నాగబాబు తదితరులు ఉన్నారు. జనసేన యాత్రలో భాగంగా 28 మంది కౌలు రైతు కుటుంబాలను పవన్ పరామర్శించనున్నారు. వారందరికీ లక్ష వంతున ఆర్ధిక సాయం చెక్కులను అందజేయనున్నారు. అనంతరం అనంతపురం రూరల్ మండలం పూలకుంట, మన్నీల గ్రామాలకు చేరుకున్నారు.
పరామర్శ పేరుతో రాజకీయ డ్రామా
మరో పక్క జనసేన కౌలు రైతు భరోసా యాత్రను వైసీపీ విమర్శిస్తోంది. పుట్టపర్తి వైసీపీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ టీడీపీ హయాంలో రైతు ఆత్మహత్యలపై మాట్లాడని పవన్ కల్యాణ్ నేడు ఆత్మ హత్య చేసుకున్న రైతు కుటుంబాల పరామర్శ పేరుతో రాజకీయ డ్రామాలకు తెరలేపారని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో రైతు కుటుంబానికి వైసీపీ ప్రభుత్వం రూ.7 లక్షల వంతున ఆర్ధిక సాయం అందజేసిందన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 201 మంది కి రూ.11.95 కోట్లు పంపిణీ చేయడం జరిగిందన్నారు. గతంలో 110 మంది రైతు కుటుంబాలకు చంద్రబాబు ప్రభుత్వం పరిహారం ఎగ్గొట్టారని, టీడీపీ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు కూడా సీఎం జగన్ ప్రభుత్వం పరిహారం అందజేసిందన్నారు. ఆర్ధిక సాయాన్ని రూ.5లక్షల నుండి 7 లక్షలకు ప్రభుత్వం పెంచిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు రామకృష్ణ కుటుంబానికి 17 రోజుల్లో రూ.7 లక్షల అందజేయడం జరిగిందన్నారు.