Pawan Kalyan: జగన్మోహనరెడ్డి పాలనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దౌర్భాగ్యపు, దిక్కుమాలిన, దాష్టీక పాలన అంటూ నిప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్ ఈ దాష్టీకాలను ధీటుగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. పరిషత్ ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసిన గెలుపొందిన అభ్యర్థులకు మరో సారి అభినందనలు తెలిపిన పవన్ కల్యాణ్ జనసేన విజయ ప్రస్థానం బిందువుగా మొదలై సింధువుగా దినదినాభివృద్ధి చెందుతోందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఫలితాలు వ్యక్తిగతంగా తనకు చాలా ఆనందాన్ని ఇచ్చాయన్నారు. రాష్ట్రంలో ఇలాంటి దాష్టీక పాలన మన దేశంలో ఎక్కడా లేదని అన్నారు. పరిషత్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో ప్రత్యర్థులపై దాడులు చేసి బెదిరింపులకు దిగారని, వైసీపీ దాష్టీక పాలన చూసి ఓపిక నశించిందన్నారు.
151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మంచి పాలన అందిస్తారు అనుకుంటే దాడులు, బెదిరింపులతో పాలన చేస్తున్నారని విమర్శించారు. వారి దాష్టీక పాలనను ఎదుర్కోవాలని బలంగా నిర్ణయించుకున్నామని పేర్కొన్నారు. వైసీపీ దాడులను ఎలా ఎదుర్కోవాలి, క్షేత్రస్థాయిలో పోరాటాలకు ఎలా సిద్ధం అవ్వాలని అని దానిపై ఈ నెల 27,28 తేదీల్లో విజయవాడలో పార్టీ నాయకులతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి చర్చిస్తామని తెలిపారు. ఇక నుండి ప్రతి జిల్లాల్లో క్షేత్ర స్థాయి పర్యటనలు జరిపి ప్రజల పక్షాన నిలబడతామనీ, రాష్ట్రాన్ని కాపాడుకుంటామని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికార పార్టీ నుండి దాడులు, ఇబ్బందులు ఎదురైనా జనసేన నాయకులు, కార్యకర్తలు, అభ్యర్థులు బలంగా నిలిచారన్నారు.
ఒక్క ఎమ్మెల్యేతో ప్రారంభమై..మొన్న జరిగిన పంచాయతీ ఎన్నికల్లో 1209 సర్పంచ్ లు, 1576 ఉప సర్పంచ్ లు, 4456 వార్డు సభ్యులు గెలిచాం. అలాగే నిన్న జరిగిన పరిషత్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేసింది 1200 స్థానాలు అయితే 177 స్థానాలలో జనసేన అభ్యర్థుల గెలిచారనీ, మరో ముగ్గురు స్వతంత్ర అభ్యర్థులు జనసేన మద్దతుతో గెలిచారన్నారు. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 25 శాతం పైచిలుకు ఓట్ల శాతం సాధిస్తే..పరిషత్ ఎన్నికల్లో 25.2 శాతం ఓట్ల వచ్చాయన్నారు. రెండు జడ్పీటీసీ స్థానాలు జనసేన గెలుచుకున్నట్లు చెప్పారు. ఈ ఫలితాలు గొప్ప మార్పునకు సూచనగా భావిస్తున్నామన్నారు.
పవర్ పాలిటిక్స్, అవకాశవాద రాజకీయాలు రాజ్యమేలుతున్న ఇలాంటి పరిస్థితుల్లో సైద్ధిందిక సూత్రాలకు నిలబడి సాధించిన ఈ విజయం బలమైన మార్పునకు సంకేతమని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనూ కూడా టీఆర్ఎస్ పార్టీ చాలా తక్కువ స్థానాలే గెలిచిందనీ, కానీ ఆ గెలుపు మార్పునకు సంకేతమైందన్నారు. ఈ రోజు వాళ్లే తెలంగాణలో విజయబావుటా ఎగురవేశారు అని, మార్పు చాలా చిన్న అడుగుతోనే మొదలు అవుతుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో అధికార వైసీపీ చేసిన దౌర్జన్యాలు, బలవంతపు ఉపసంహరణలు, కేసులు నమోదు, కౌంటింగ్ సమయంలో దౌర్జన్యాలు తదితర విషయాలను పవన్ కల్యాణ్ వివరించారు.