Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ తమ మిత్రపక్షంగా పేర్కొంటున్న బీజేపీకి షాకిచ్చారు. ఎన్నికల తర్వాత ఆ పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేనాని గత కొద్దికాలంగా జరుగుతున్న ఆసక్తికర చర్చకు క్రేజీ అప్డేట్ ఇచ్చారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్నగర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి మరోసారి బరిలోకి దిగిన బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్సీ రాంచందర్ రావును కాదని తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ బరిలో దించిన మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కూతురు వాణిదేవికి మద్దతు ప్రకటించడం, ఆమె విజయం సాధించడం తెలిసిన సంగతే. ఈ ట్విస్టులకు కొనసాగింపుగా జనసేన కీలక ప్రకటన చేసింది.
పవన్ పార్టీ ఏం చెప్తోందంటే…
బీజేపీతో పొత్తు , తాజా ఎన్నికల గురించి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సన్నిహితుడు, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీజేపీతోనే కలిసి వెళ్తామని కానీ అది ఏపీ వరకే పరిమితం అని అన్నారు. దివంగత ప్రధాని పి.వి. నరసింహారావు కుమార్తె కనుక తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మద్దతు ఇచ్చామని నాదెండ్ల మనోహర్ అన్నారు. జనసేన, బీజేపీ పొత్తు ఏపీకే పరిమితం అని పేర్కొన్న ఆయన జాతీయ స్థాయిలో పార్టీ ఆలోచన చేయలేదని పవన్ పార్టీ ముఖ్య నేత క్లారిటీ ఇచ్చారు.
బీజేపీ ఏం చెప్తోంది..
ఎన్నికల ఫలితాలపై మీడియాతో మాట్లాడిన బీజేపీ అభ్యర్థి రాంచందర్రావు.. తాను ఓటమిని అంగీకరిస్తున్నానని ప్రకటించారు.. అయితే, గ్రాడ్యుయేట్స్ సిగ్గుపడేలా ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వచ్చాయని.. బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని విభజించటంలో సీఎం కేసీఆర్ సక్సెస్ అయ్యారని కామెంట్ చేశారు. టీఆర్ఎస్ కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం అనటానికి తనకు వచ్చిన ఓట్లే ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై వ్యతిరేక ఓటు చాలా స్పష్టంగా కన్పించింది.. మరింత కసిగా పనిచేసి 2023లో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని రామచందర్రావు అన్నారు. పీఆర్సీ అమలు చేయాలి, నిరుద్యోగభృతి ఇవ్వాలి, ఉద్యోగాల భర్తీలను వెంటనే చేపట్టాలని రామచందర్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలతో సమావేశమయ్యారని మండిపడ్డారు.