Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి వైసీపీ సర్కార్, సీఎం వైఎస్ జగన్ పై సీరియస్ కామెంట్స్ చేశారు. ఆదివారం నరసాపురంలో మత్స్యకార అభ్యున్నతి సభలో పవన్ కళ్యాణ్ వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేనను బెదిరించాలని చూసే నాయకులకు ఒకటే చెబుతున్నా.. మీ పిచ్చిపిచ్చి వే€షాలకు జనసేన భయపడదు అని స్పష్టం చేశారు. సంయమనం పాటిస్తున్నాము అంటే అది తమ బలం అని, బలహీనత కాదని పేర్కొన్నారు. గొడవలు పెట్టుకునేందుకు చాలా ఆలోచిస్తామని అన్నారు. పార్టీ అధినేతగా కార్యకర్తల కుటుంబాలను కూడా దృష్టిలో పెట్టుకుని వ్యవహరిస్తానని అన్నారు. కార్యకర్తలను ఇబ్బందులు పాలుచేసే నిర్ణయాలు తీసుకోమని, తమ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి హింసిస్తే రోడ్డుపైకి ఏ స్థాయికైనా దిగి పోరాడతామని అన్నారు.
Pawan Kalyan: కష్టాన్ని దోచే చట్టాన్ని ఎదిరించాలి
మత్సకారులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన జీవో 217కు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించుకున్న తర్వాత ఎక్కడా వెనుకంజ వేయలేదన్నారు. మత్సకారులకు అండగా నిలిచేందుకు యాత్రగా ప్రారంభించి నరసాపురంలో ముగించామన్నారు. 32 మత్స్యకార కులాలు తీర ప్రాంతంలో జీవనం సాగిస్తున్నారని దాదాపు 60 లక్షల మంది ఉన్నారని చెప్పారు. సముద్రంపై ఆధారపడి 557 మత్స్యకార గ్రామాలు ఉన్నాయని తెలిపారు. గంగమ్మ తల్లి ఆశీస్సులతో మత్స్యకారులకు అండగా నిలబడతానని చెప్పారు. జివో 217 జివో మత్స్యకారుల పొట్ట కొడుతుందన్నారు. ఇష్టం లేని చట్టం, దోపిడీ చేసే చట్టం, కష్టాన్ని దోచే చట్టాన్ని ఎదిరించాలన్నారు. జనసేనకు కనీసం పది మంది ఎమ్మెల్యేలు అయినా ఉండి ఉంటే జివో 217 ఇచ్చేందుకు ప్రభుత్వం ధైర్యం చేసి ఉండేది కాదన్నారు. సభలోనే పవన్ కళ్యాణ్ జివో కాపీని చించి తన నిరసనను తెలియజేశారు. జీవో ప్రతులను చించివేసిన తనపై కేసులు పెట్టుకున్నా భయపడేది లేదని సవాల్ విసిరారు.
సమస్యలను సృష్టించేది వైసీపీయే
వంగి వంగి దండాలు పెట్టడానికి తాను రాజకీయాల్లోకి రాలేదన్నారు. సమస్యలను వైసీపీయే సృష్టించి దానిని పరిష్కరించడంలో కాలయాపన చేస్తుందని విమర్శించారు పవన్ కళ్యాణ్. తాను చట్టాలను గౌరవిస్తాననీ, కానీ దోపిడీ చేసే చట్టాలను అదే స్థాయిలో వ్యతిరేకిస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం ఎలానూ బ్రాందీ షాపులు నిర్వహిస్తుంది కాబట్టి ఆ పార్టీ నాయకులు చీకుల కొట్టు కూడా పెట్టుకోవాలని సెటైర్ వేశారు. మటన్, టికెట్ కొట్లు నడపడానికి అధికారం ఇవ్వలేదని అన్నారు. పాదయాత్ర చేసింది చేపల దుకాణాలు పెట్టుకోవడానికి అని ప్రశ్నించారు. నిలబెట్టుకోలేని హామీలను ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో
ఇదే క్రమంలో ఇటీవల చిరంజీవి నేతృత్వంలో సినీ ప్రముఖులు జగన్ ను కలిసి అభ్యర్ధించిన తీరుపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఎంత పెద్ద స్థాయి వ్యక్తులు అయినా వైసీపీ నేతల ముందు మోకరిల్లితేనే వారి ఈగో సంతృప్తి చెందుతుందని అంత ఈగో ఎందుకని ప్రశ్నించారు. ఇది ప్రజా స్వామ్య దేశం, రాచరికం కాదని పవన్ కళ్యాణ్ అన్నారు. తాను చావడానికైనా సిద్ధపడతాను కానీ తలవంచడానికి ఇష్టపడనని అన్నారు. వచ్చే ఎన్నికల్లో మత్స్యకారుల కోసం ప్రత్యేక మ్యానిఫెస్టో పెడతామనీ, తనకు అండగా నిలబడాలని కోరారు.