Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎన్నికల ప్రచార రథం వారాహికి విజయవాడ కనకుదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న కొండగట్టు అంజన్న ఆలయం వద్ద తొలి పూజలు జరిపించిన పవన్ కళ్యాణ్ ఇవేళ విజయవాడ చేరుకుని కనకదుర్గమ్మ ఆలయంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి, వాహనానికి పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో రాక్షస పాలన అంతం చేయడమే వారాహి ముఖ్యలక్ష్యమని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, అన్ని వర్గాలకు మేలు జరగాలని శ్రీకనకదుర్గమ్మ అమ్మవారిని కోరుకున్నట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. రాజకీయాల్లోకి యువతరం రావాలని, తెలుగు రాష్ట్రాలు ఐక్యంగా అభివృద్ధి సాధించాలని అమ్మవారిని కోరుకున్నట్లు చెప్పారు. కచ్చితంగా వారాహి తో త్వరలో ప్రజలకు కలుసుకుంటానని తెలిపారు. వారాహి వాహనం పూజల్లో సహకరించిన ఆలయ ఇఓ, అధికారులు, వేదపండితులు, అర్చకులు, పోలీసులకు, ఇతర సిబ్బందికి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
వారాహి పూజ అనంతరం పవన్ కళ్యాణ్ వాహనం ఎక్కి వేలాదిగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు, అభిమానులకు అభివాదం చేస్తూ మంగళగిరి పార్టీ కార్యాలయానికి బయలుదేరారు. కనకదుర్గమ్మ ఫ్లైఓవర్ నుండి అభిమానులు పవన్ కళ్యాణ్ పై పూల వర్షం కురిపించారు. దుర్గమ్మ అలయం వెలుపల ప్రత్యేకంగా తయారు చేయించిన గజమాలతో పవన్ కళ్యాణ్ ను సత్కరించారు. వారాహికి వీర మహిళలు వంద బిందెలతో నీళ్లు పోసి స్వాగతం పలికారు. దారి పొడవునా అభిమానులు ఘన స్వాగతం పలికారు. వారధి వద్ద పవన్ కళ్యాణ్ కు మహిళలు హరతులు పట్టి పూలాభిషేకం చేశారు. సీతమ్మ పాదాల దగ్గర 108 అంబులెన్స్ సైరన్ వినిపించడంతో పవన్ కళ్యాణ్ తన వాహన శ్రేణిని పక్కకు నిలిపివేయించి అంబులెన్స్ కు దారి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పవన్ వెంట నాదెండ్ల మనోహర్, విజయవాడ నేతలు పోతిన వెంకట మహేష్ తదితరులు పాల్గొన్నారు.