Pawan Kalyan: రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలను ఈ నెల 12వ తేదీ నుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరామర్శించి, లక్ష వంతున ఆర్ధిక సహాయం అందజేయనున్నారు. ఆత్మహత్యలకు పాల్పడ్డ కౌలు రైతుల కుటుంబాలను ఆదుకునే నిమిత్తం రూ.5 కోట్ల విరాళం చెక్కును పవన్ కళ్యాణ్ అందజేశారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు జనసేన తరపున ఆర్ధిక సహాయం అందజేయనున్నట్లు ఉగాది పండుగ రోజున పవన్ కళ్యాణ్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో మంగళవారం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆర్థిక సాయం అందజేసే కార్యక్రమాన్ని ఈ నెల 12 నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందజేయడం జరుగుతుందన్నారు. ఈ పరామర్శ యాత్రలను ఈ నెల 12న అనంతపురం నుంచి ప్రారంభించనున్నట్లు పవన్ ప్రకటించారు.
Pawan Kalyan: జనసేన అంటే వైసీపీ నేతలకు భయమెందుకు..?
ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాన్ని 25 సంవత్సరాల వెనక్కి తీసుకెళ్లిన వైసీపీకి ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. వైసీపీ ప్రభుత్వం మరో సారి అధికారంలోకి రాదని అన్నారు. మళ్లీ రాని ప్రభుత్వం కోసం అధికారులు తాపత్రపడవద్దని సూచించారు పవన్ కళ్యాణ్. ప్రభుత్వ వ్యతిరేక ఓటుపై చాలా ఆలోచించే మాట్లాడానని అన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని తాను అంటే వైసీపీకి ఉలుకు ఎందుకు అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఆరాచకం, దోపిడీతో రాష్ట్రాన్ని శ్రీలంకలా మారుస్తున్నందునే తాను ఆ మాటల మాట్లాడానని చెప్పారు పవన్. అంతే తప్ప తాను చేసిన వ్యాఖ్యలు రాజకీయ వ్యూహం కోసం కాదని అన్నారు. తాము ఎవరి పల్లకీ మోసేందుకు ఇక్కడ లేమని అన్నారు. జనసేన అంటే వైసీపీ నేతలకు భయమెందుకని ప్రశ్నించారు పవన్. సమావేశంలో పలు తీర్మానాలు ఆమోదించారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తీర్మానం చేశారు. అమరావతి లోనే రాజధాని వుండాలని, పెరిగిన పెట్రోల్, డీజిల్ ,గ్యాస్ ధరలు తగ్గించేందుకు కేంద్ర, రాష్ట్ర పన్ను వాటా తగ్గించాలని, ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులను లక్ష రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని, రాష్ట్ర లో మహిళల భద్రత, శాంతి భద్రత విషయంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ తీర్మానాలను ఆమోదించారు.