Pawan Kalyan: కౌలు రైతు భరోసా యాత్రలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో 80 మంది కౌలు రైతులకు లక్ష వంతున ఆర్ధిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా పర్చూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దసరా వరకూ వైసీపీ వాళ్లు ఏమి మాట్లాడినా భరిస్తామనీ, అప్పటి నుండి ప్రజల్లోనే ఉండి వాళ్ల సంగతి చూస్తామని అన్నారు. పొత్తుల గురించి మాట్లాడే సమయం కాదనీ, పాత్తు ప్రజలతోనే ఇంకెవరితోనూ లేదని అన్నారు. 2024 లో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన వారిని మానసికంగా హింసిస్తున్నారనీ, రాజకీయ కక్ష తీర్చుకోవడానికే మాత్రమే అధికార యంత్రాంగాన్ని వినియోగించుకుంటున్నారని పవన్ కళ్యాణ్ విమర్శించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
సరిగా పని చేయకపోతే రెండేళ్ల తర్వాత రీకాల్ చేసే విధంగా చట్టం రావాల్సిన అవసరం ఉందన్నారు. సీఎం కాకపోతే రాజకీయాల్లో నుండి వెనక్కు వెళ్లిపోయేందుకు తాను పార్టీ పెట్టలేదనీ, సరిగా పని చేయకపోతే సీఎం చొక్కా పట్టుకునే విదంగా యువకులను తయారు చేసేందుకు రాజకీయాల్లోకి వచ్చానని అన్నారు. వైసీపీ ప్రభుత్వం రూ.5 కోట్లు అప్పులు చేసింది. ఆ అప్పు ఏమి చేశారని వైసీపీ ఎమ్మెల్యేలను ప్రశ్నించాలన్నారు. వైసీపీ నాయకులకు లక్షల కోట్లు దోపిడీ చేసే సత్తా ఉన్నప్పుడు జనసేనకు రూ.2.5 లక్షల ఉద్యోగాలు ఇచ్చే సత్తా ఉందని అన్నారు.
2014 లో తాను పోటీకి దిగి ఉంటే పరిస్థితులు ఇలా ఉండేవి కావని పవన్ అన్నారు. నన్ను దత్తపుత్రుడు అని వైసీపీ విమర్శిస్తుందనీ, తాను కూడా సీబీఐ దత్తపుత్రుడని అనగలనన్నారు. వైసీపీ నాయకులు సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బాధ్యతలేని వ్యక్తులు రాజకీయాల్లో ఉండకూడదని అన్నారు. రాష్ట్ర ప్రజలకు వచ్చే ఎన్నికలు చాలా కీలకమన్నారు. నిరుద్యోగులకు జనసేన అధికారంలోకి వస్తే జాబ్ కాలెండర్ ప్రకటిస్తామని, రైతు ప్రయోజనాలు కాపాడతామని వాగ్దానం చేశారు. చాలా సార్లు ఇతరులకు అవకాశం ఇచ్చారు. ఈ సారి జనసేనకు అవకాశం ఇవ్వాలని కోరారు పవన్ కళ్యాణ్.
ప్రత్యేక హోదా కోసం ప్రధాన మంత్రితో విబేధించాననీ, దాని వల్ల వ్యక్తిగతంగా తాను నష్టపోయానన్నారు. రాజకీయాల్లో ప్రజలు ముందుకు వెళ్లేలా చేయడమే తన తపన అనీ, తనకు వ్యక్తిగత స్వార్ధం ఏమి లేదని అన్నారు పవన్ కళ్యాణ్. తొలుత మంగళగిరి పార్టీ కార్యాలయం వద్ద నుండి రోడ్డు మార్గంగా బయలుదేరిన పవన్ కళ్యాణ్ కు అడుగడుగునా అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఏటుకూరు, చిలకలూరిపేట, మార్టూరు,రాజుపాలెం మీదుగా పర్చారు వరకూ భారీ ర్యాలీ గా పవన్ కు స్వాగతం పలికారు.