జనసేన అధినేత , సినీనటుడు పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరోవైపు రాజకీయాల్లో కూడా బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. తన వకీల్సాబ్ సినిమా పనులు ఓ వైపు చూసుకుంటూనే మరోవైపు ప్రజా సమస్యలపై సైతం స్పందిస్తున్నారు. తాజాగా ఆయన తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించారు. అక్కడ ప్రజలకు సంఘీభావం తెలిపిన పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
జగన్ , వైసీపీ , పవన్ …
ఏపీ సీఎం వైఎస్ జగన్, అధికార వైసీపీ పార్టీ తన శత్రువు కాదని పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. దివిస్ సంస్థకు కూడా తాను వ్యతిరేకం కాదని పేర్కొంటూ వాళ్ల విధానాలకు వ్యతిరేకం అని అన్నారు. సిద్ధాంతాలు కోసం పని చేస్తానన్న ఆయన తమకు ఎమ్మెల్యే లు లేకపోయినా పోరాటం చేస్తానని అన్నారు. చాలామంది అన్నారు, ప్రజలు నమ్మరు వదిలేయి ..అంటారు ..నా ఇంట్లో బిడ్డలను వదిలేస్తానా ? ఈ భూమి వైసీపీ వాళ్ళ సొంతమా, రోడ్ల మీద ప్రజలు ముద్దులు పెడితే చాలదు…పద్దతిగా ప్రజలను కాపాడాలని అన్నారు.
పవన్ కళ్యాణ్ సభలంటే… ఇంతే
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనపై వచ్చే విమర్శలకు ఆసక్తికర క్లారిటీ ఇచ్చారు. “నీ సభలకు పిల్లలు వస్తారు అని చాలామంది అన్నారు. అవును నిజమే…వాళ్ళ భవిష్యత్ కోసం పోరాటం చేస్తున్నాను కాబట్టి వస్తున్నారు` అని అన్నారు. అయితే, జనసేనానికి గత ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ ఫాలోయింగ్ దక్కినప్పటికీ ఎన్నికల్లో సీట్లు మాత్రం దక్కలేదు. దీనికి కారణం ఓటు హక్కు కూడా లేని ఫ్యాన్స్ ఎక్కువగా ఉండటమే అనే విశ్లేషణ ఉంది. మరోవైపు పార్టీ తరఫున గెలిచిన ఏకైక ఎమ్మెల్యే సైతం అధికార పార్టీకి మద్దతు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పవన్ ఆ రెండు అంశాలను ప్రస్తావించారని చర్చ జరుగుతోంది.