Pawan Kalyan : ఏపీ బీజేపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకోవాలని చూస్తున్న ఏపీ బీజేపీ రథసారథి సోము వీర్రాజు గత కొద్దికాలంగా ఈ మేరకు తన వంతు ప్రయత్నాలు చేస్తున్న సంగతి తెలిసిందే.
ప్రతిపక్ష పార్టీలకు సమాన స్థాయిలో బీజేపీని తీర్చిదిద్దాలని ఆయన భావిస్తున్నారు. అయితే, అనుకున్నంత ఈజీ కాదనుకోండి. ప్రస్తుతం విశాఖపట్నం ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ వ్యవహారం ఏపీలో సంచలనం రేపుతోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందనే వార్తలతో… ఏపీలోని ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలు ఉక్కు ఉద్యమంలోకి దిగాయి. గంటా శ్రీనివాస్ ఏకంగా రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో విశాఖ స్టీల్ ప్లాంటు ప్రైవేటీకరణపై బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు.
వీర్రాజు గారు ఎట్టకేలకు…
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం దాదాపు పదిహేను రోజులుగా రాష్ట్రంలో కాకరేపుతుండగా.. స్టీల్ ప్లాంటును కారు చౌకగా అమ్మడానికి వీల్లేదని బీజేపీ చీఫ్ సోము వీర్రాజు తాజాగా స్పష్టం చేశారు. దీనిపై కేంద్రమంత్రి అమిత్ షాను కలుస్తామన్నారు. అయితే, బీజేపీ నేతల ప్రయత్నం ఎంతమేరకు ఫలిస్తుందనేది వేచి చూడాల్సిన విషయమే. మరోవైపు ఇప్పటికే హస్తినలో పర్యటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాతో సమావేశం అయ్యారు. అరగంటకు పైగా జరిగిన ఈ సమావేశంలో స్టీల్ ప్లాంట్ గురించి ప్రస్తావించారు.
Pawan Kalyan పవన్ కళ్యాణ్ కు మైలేజీ రావొద్దనా?
ఏపీలో బీజేపీకి జనసేన పార్టీ భాగస్వామ్య పక్షంగా ఉంది . స్టీల్ ప్లాంట్ విషయంలో బీజేపీ కంటే ముందే జనసేన స్పందించింది. ఆందోళన విషయంలో పవన్ ఢిల్లీకి పయనం అయ్యారు. పార్లమెంట్లో అమిత్ షాతో భేటీ అయిన పవన్ కల్యాణ్, నాదెండ్ల మనోహర్.. స్టీల్ ప్లాంట్ వ్యవహారంపై చర్చించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దని ఈ భేటీలో షాకు వినతిపత్రం కూడా అందజేశారు. అయితే, కేంద్రం తీసుకునే నిర్ణయం ఒకవేళ జనసేన ఖాతాలో పడుతుందేమోనన్న ఉద్దేశంతో వీర్రాజు తాజాగా ఈ టూర్ పెట్టుకున్నారా? అంటూ పలువురు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.