Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు రాజకీయాల్లో సైతం బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేస్తున్నారు. అయితే, ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్లు ఆయన్ను రాజకీయ ప్రత్యర్థులు టార్గెట్ చేసేందుకు అవకాశం ఇచ్చాయని అంటున్నారు. తాజాగా సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పవన్ కళ్యాణ్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డూలు తింటున్నాడని సెటైర్ వేశారు.
ఆనాడు ఏమన్నావు పవన్?
గతంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పాచిపోయిన లడ్డూతో పోల్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు నారాయణ ప్రశ్నించారు. అప్పుడు పాచిపోయిన లడ్డూలు ఇప్పుడు తియ్యగా, కమ్మగా ఉన్నాయా? అని అన్నారు.
బీజేపీకి మద్దతు ఇవ్వడంపై పవన్ కళ్యాణ్ సమీక్షించుకోవాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రం తన వైఖరి వెల్లడించాలని నారాయణ డిమాండ్ చేశారు.
చంద్రబాబును వదలలేదు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎన్నికలు బాయ్ కాట్ చేయడంపై నారాయణ మరోమారు స్పందించారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన అనుభవంతో పాటుగా నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు ఎన్నికలకు భయపడి పారిపోవడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికలను ఎదుర్కోవాలి, పారిపోతే ఎట్లా కుదురుతుంది? అని ప్రశ్నించారు. క్రింద కేడర్ , రాజకీయ పార్టీ , ఓట్లు ఏమవుతాయి ? అని ఆయన ప్రశ్నించారు. బతికుండి ఓటు వేయకపోతే చచ్చినట్లే లెక్క అని ఆయన అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.