Pawan Kalyan : జనసేన పార్టీ అధినేత , సినీ నటుడు పవన్ కళ్యాణ్ , ఆయన మిత్రపక్షం అయిన బీజేపీ నేతల గురించి కొత్త చర్చ. బీజేపీ తో పొత్తున్న పవన్ కళ్యాణ్ ఆ పార్టీ కోసం శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, తెలంగాణ బీజేపీతో మాత్రం ఆయనకు పొసగడం లేదు. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఈ విషయం స్పష్టమైంది. అయితే, తాజాగా వారితోనే కలిసి ప్రచారం చేయాల్సి వస్తోందని అంటున్నారు.
తిరుపతి ఉప ఎన్నిక హోరు…
ఏపీలో జరుగుతున్న తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికపై అన్ని వర్గాల దృష్టి పడిన సంగతి తెలిసిందే. బీజేపీ అభ్యర్థి రత్నప్రభకు మద్దతుగా తిరుపతిలో జనసేనాని పవన్ కల్యాణ్ ప్రచారానికి సిద్ధమయ్యారు. ఏప్రిల్ 03వ తేదీన తిరుపతిలో పవన్కల్యాణ్ కవాత్ నిర్వహించనున్నారు. ప్రచారం చేయనున్నారు. తిరుపతిలోని ఎమ్మార్పల్లి సర్కిల్ నుంచి శంకరంబడి వరకు పవన్ పాదయాత్ర సాగనుంది. మూడో తేదీ మధ్యాహ్నం 3 గంటలకు పాదయాత్ర మొదలవుతుందని జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
బండి సంజయ్ సైతం రెడీ
మరోవైపు త్వరలో జరగబోయే తిరుపతి ఎన్నికల ప్రచారానికి బండి సంజయ్ వెళ్లనున్నట్టుగా తెలుస్తోంది. ఏప్రిల్ 14న తిరుపతిలో జరిగే ర్యాలీలో బండి సంజయ్ పాల్గొనే అవకాశం ఉంది. తిరుపతిలో ప్రచారం నిర్వహించాల్సిందిగా ఇప్పటికే బండి సంజయ్ను బీజేపీ జాతీయ నాయకత్వం ఆదేశించింది. అయితే, పవన్ టూర్ లో కూడా సంజయ్ పాల్గొంటారా? అనే సర్వత్రా ఆసక్తి నెలకొంది.