Pawan Kalyan: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమం నిర్వహించేందుకు వైసీపీ ప్రభుత్వం అఖిపక్షం ఏర్పాటు చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కోరిన విషయం తెలిసిందే. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొని వారి ఆందోళనకు సంఘీభావం తెలియజేయడంతో పాటు కేంద్రంపై ఒత్తిడి చేసేందుకు అన్ని రాజకీయ పక్షాలు ఉమ్మడిగా కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం స్పందించి అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకువెళ్లేందుకు ముందుకు రావాలని సూచించారు. ప్రభుత్వానికి వారం రోజులు సమయం ఇస్తున్నామనీ పవన్ పేర్కొన్నారు. అయితే పవన్ కల్యాణ్ ఇచ్చిన డెడ్ లైన్ రేపటితో ముగుస్తుంది.
Pawan Kalyan: పవన్ వైఖరిపై అనుమానాలు
పవన్ కళ్యాణ్ గతంలోనూ పలు అంశాలలో ప్రభుత్వానికి డెడ్ లైన్ లు విధించి ఆ తరువాత వాటిపై ముందుకు వెళ్లలేదన్న విమర్శలు ఉన్నాయి. అమరావతి రాజధాని అంశంలో తొలుత దూకుడుగా వెళ్లిన జనసేన ఆ తరువాత సైలెంట్ అయిపోయారు. జనసేన, బీజేపీ ఆధ్వర్యంలో లాంగ్ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించి ఆ తరువాత ఆ ఊసే ఎత్తలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపితో దోస్తీగా ఉన్న పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో ప్రధాన మంత్రి మోడీతో పేచీ పెట్టుకుంటారా అనే దానిపైనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ ఒక సారి తీసుకున్న నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం అనేది కష్టమే. జమ్ము కశ్మీర్, ఎన్ఆర్ సీ, నూతన సాగు చట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక కీలక అంశాల్లో ప్రతిపక్షాల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయినా మోడీ సర్కార్ వెనక్కు తగ్గిన దాఖలాలు లేవు,. ఇవన్నీ తెలిసి కూడా పవన్.. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తారా ?, సక్సెస్ అవ్వగలరా? అనేది పెద్ద ప్రశ్న.
విశాఖ కేంద్రంలో మరో భారీ ప్రదర్శనకు సన్నాహం
మరో పక్క పవన్ ఇచ్చిన అల్టిమేటమ్ వైసీపీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదు. అఖిలపక్షం ఏర్పాటు చేయాలన్న ఊసే ప్రభుత్వానికి లేదు. పవన్ చేసిన ప్రకటన చేసిన వెంటనే వైసీపీ నేతల నుండి వచ్చిన స్పందనే ఇందుకు నిదర్శనంగా ఉంది. అయితే ప్రభుత్వం గనుక అఖిలపక్షం ఏర్పాటు చేస్తే తాము కూడా హజరు అవుతామని బీజేపీ కూడా ప్రకటించింది. అయితే గత విషయాలు ఎలా ఉన్నా ఈ సారి మాత్రం పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని భుజానికెత్తుకోవడానికి సిద్దంగా ఉన్నారు. విశాఖలో లాంగ్ మార్చ్ ను నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇతర రాజకీయ పక్షాలన్నింటినీ కలుపుకుని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రదర్శన నిర్వహించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. మొన్న జరిగిన సభ విజయవంతం కావడంతో మరో మారు విశాఖ కేంద్రంగానే భారీ ప్రదర్శనకు జనసేనాని సిద్ధం అవుతారని టాక్.