పవన్ తో జగన్ మీటింగ్ ఏమిటి అనుకుంటున్నారా మీరు వింటున్నది నిజమే అది ఎవరు అన్నారు, ఎందుకు అన్నారు అనే విషయాల్లోకి వెళ్లే ముందు ఈ కింది మాటర్ చదివితే అర్థం అవుతుంది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరును జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రకాశం జిల్లా పర్యటన సందర్భంలో పవన్ కళ్యాణ్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యకర్త రోడ్లు సరిగా లేవు అంటూ స్థానిక సమస్యల బాధ్యతను అధికార పార్టీ నాయకుడికి గుర్తు చేస్తే ఆ పార్టీ కార్యకర్తలు అతని కుటుంబంపై పడ్డారని అన్నారు. సున్నితమైన అంశాలలో జనసేన పార్టీ ఆచిచూసి అడుగు వేస్తుందని అందుకే రామతీర్థం ఘటన విషయంలో సంయమనం పాటించి అక్కడకు వెళ్లలేదని పవన్ చెప్పుకొచ్చారు. ప్రజాస్వామ్యంలో తప్పు జరిగితే ప్రశ్నించే హక్కును రాజ్యాంగం అందరికీ ఇచ్చిందనే విషయం నేతలు గుర్తెరగాలన్నారు.
ప్రజలను కులాలుగా, మతాలుగా విభజించి మాట్లాడే నైజం జనసేనది కాదని అన్నారు. బీజెపీని మతతత్వ పార్టీ అని విమర్శించే వారు బైబిల్ పట్టుకుని తిరగలేదా అని ప్రశ్నించారు. జనసేన ఓటు బ్యాంకు రాజకీయాలు చేయదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే మరో విగ్రహం పెడుతామంటున్నారే కానీ ఓ మతంపై జరుగుతున్నదాడిగా చూడటంలేదనీ, అధికార పార్టీ నేతల్లో సీరియస్ నెస్ కనబడటం లేదని అన్నారు. ఓ చర్చిపైనో, మసీదుపైనో దాడి జరిగితే ఇలానే చూస్తారా అని ప్రశ్నించారు. ఏ మతానికి చెందిన ప్రార్థనా మందిరాలపై దాడి జరిగినా ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో వైసీపీ నేతల దౌర్జన్యాలు పెరిగిపోయాయని పవన్ కళ్యాణ్ తీవ్రంగా విమర్శించారు. వైసీపీపై గానీ ప్రభుత్వంపైగానీ సోషల్ మీడియాలో ఒక్క కామెంట్ పెట్టినా వెంటనే కేసులు పెట్టేసి అరెస్టులు చేసేస్తున్నారనీ పవన్ అన్నారు. అధికార పార్టీ నేతలు న్యాయవ్యవస్థపై ఇష్టానుసారంగా మాట్లాడితే వారిపై కేసులు ఉండవని అన్నారు. రాజకీయ పార్టీ నాయకుల విగ్రహాలను కూల్చివేస్తే పరిస్థితులు ఇలానే ఉంటాయా అని పవన్ ప్రశ్నించారు. సింగరాయకొండ జర్నలిస్ట్ లపై అక్రమ కేసులు బనాయించి అరెస్టు చేయడంపైనా డీజీపీతో మాట్లాడానని చెప్పారు పవన్ కళ్యాణ్, కేసులు పెడితే భయపడే రోజులు పోయాయన్నారు. అవసరం అయితే సమస్యలపై మాట్లాడేందుకు సీఎం జగన్ తో కలిసేందుకు కూడా తాను సిద్ధమేనని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.