AP CM YS Jagan: ఓ పక్క వైఎస్ జగన్మోహనరెడ్డి రెండేళ్ల పాలనలో మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో 94.5 శాతం నెరవేర్చామని వైసీపీ ప్రకటించింది. ఇచ్చిన హామీలనే కాక ఇవ్వని చాలా అమలు చేయడం జరిగిందని చెప్పుకొస్తున్నారు. ప్రజా సంక్షేమానికి జగన్ సర్కార్ పెద్ద పీట వేసింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో కొన్ని ప్రధానమైనవి నెరవేరలేదు. కొన్నింటిని అసలు పూర్తిగా విస్మరించినట్లుగా ఉంది. ఈ సందర్భంలో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ తులసిరెడ్డి జగన్ సర్కార్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అబద్దాల ప్రచారంలో జగన్ గ్లోబెల్ ను మించిపోయారని ఆయన వ్యాఖ్యానించారు. గతంలో చంద్రబాబును ఇదే విధంగా గ్లోబెల్ ప్రచారం అంటూ విమర్శించే వారు. అయితే ఇప్పుడు తులసిరెడ్డి ఏమంటున్నారంటే… వైఎస్ఆర్ పెళ్లి కానుక ఏమైందని ప్రశ్నించారు. గతంలో వివిధ వర్గాలకు చెందిన పేదల వివాహ సందర్భంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీలకు రూ.50వేల నుండి లక్ష వరకూ ఆర్థిక సహాయం అందించే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఒక్కరికీ వైఎస్ఆర్ పెళ్లి కానుక మంజూరు కాలేదు. వైఎస్ఆర్ పెళ్లి కానుకకు సంబంధించి గతంలో కంటే ఆర్థిక సాయం పెంపు ప్రకటన అయితే చేశారు గానీ ఎన్నికలకు ముందు వివాహాలు జరిగిన వారికి ఇంత వరకూ నిధులు విడుదల కాలేదని సమాచారం.
మేనిఫెస్టో మాటల్లో భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంటూ చేతల్లో మాత్రం చిత్తు కాగితమని తులసిరెడ్డి విమర్శించారు. ప్రతి రైతు కుటుంబానికి పెట్టుబడి సాయం కింద రూ.50వేలు ఇస్తామన్నారు. పంట వేసే సమయానికి రూ.12,500లు చొప్పున ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి ఇప్పుడు మాత్రం రూ.7,500లు చొప్పున ఇస్తూ 12,500లు కోత కోసిందని దీన్ని సీఎం ఏమంటారు అని ప్రశ్నించారు. ఏపికి ప్రత్యేక హోదా సాధిస్తామని అన్నారనీ, అది ఏమయ్యిందని ప్రశ్నించారు. ప్రతి ఏడాది జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగ భర్తీకి క్యాలెంటర్ విడుదల చేస్తామన్నారు చేశారా అని తులసిరెడ్డి నిలదీశారు. అగ్రిగోల్డ్ బాధితుల హామీ నెరవేర్చారా అని ప్రశ్నించారు. ఉద్యోగుల సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని, సకాలంలో పిఆర్సీ అమలు చేస్తామని ఇచ్చిన హామీలు నెరవేర్చారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు.