PDS Rice: రేషన్ షాపుల్లో బయో మెట్రిక్ విధానం (ఈపాస్) ఏర్పాటు చేసి వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందిస్తున్నా రాష్ట్రంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా యదేశ్చగా జరుగుతూనే ఉంది. ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా సన్న బియ్యం అందిస్తామని గతంలో హామీ ఇచ్చింది. దీనిపై టీడీపీ నేతలు విమర్శించిన సందర్భంలో సంబంధిత పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని తాము సన్న బియ్యం అని చెప్పలేదనీ, నాణ్యమైన బియ్యం అని మాత్రమే చెప్పామని వివరణ ఇచ్చారు. అయితే రేషన్ బియ్యాన్ని పాలిష్ పట్టి అందిస్తోంది. దీంతో ప్రభుత్వం అందించే రేషన్ బియ్యాన్ని ఎక్కువ శాతం మంది కార్డుదారులు వినియోగించుకోవడం లేదు. వాటిని వ్యాపారులు కొనుగోలు చేసి తరలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 నుండి 70 శాతం రేషన్ బియ్యం రిసైక్లింగ్ జరుగుతోందనేది బహిరంగ రహస్యం. అయితే రేషన్ బియ్యం అక్రమ రవాణా అంశంపై హౌసింగ్ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
గుంటూరు జిల్లా ఇన్ చార్జి మంత్రిగా ఉన్న శ్రీరంగనాథరాజు శనివారం మీడియాతో మాట్లాడుతూ రేషన్ బియ్యాన్ని ప్రజలే అమ్ముకుంటున్నారని అన్నారు. డీలర్లు అక్రమ రవాణా చేయడం లేదనీ కార్డుదారులే రేషన్ బియ్యాన్ని వ్యాపారులకు విక్రయిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం ఎంతో ఖర్చు చేసి కిలో బియ్యం రూపాయికి అందిస్తోందన్నారు. అనర్హులకు ఎక్కువగా రేషన్ కార్డులు ఉన్నాయనీ, వారు రేషన్ బియ్యం తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్న మంత్రి.. ప్రజల్లో కూడా మార్పు రావాలంటూ వ్యాఖ్యానించారు. ప్రజలు తినే నాణ్యమైన బియ్యం రేషన్ షాపుల ద్వారా అందిస్తే ఎందుకు విక్రయిస్తామని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.