Pedda Reddy Vs JC Prabhakar Reddy: అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ అధికారులు, ఉద్యోగుల పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారింది. గడచిన మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసి ప్రభాకకరెడ్డి చైర్మన్ గా ఎన్నికైన సంగతి తెలిసిందే. ప్రతిపక్ష పార్టీకి చెందిన నేత జేసి ప్రభాకరరెడ్డి చైర్మన్ గా, నియోజకవర్గంలో అధికార వైసీపీకి చెందిన ఎమ్మెల్యే పెద్దారెడ్డి ల రాజకీయంలో అధికారుల పరిస్థితి దయనీయంగా మారింది. ఒక పక్క అధికారం, మరో పక్క అధికార పార్టీ నేత మధ్య అధికారులు విధుల నిర్వహణ కష్టతరంగా మారింది. అసలే ఈ నియోజకవర్గంలో జేసీ, పెద్దారెడ్డి వర్గీయుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి. ఈ పరిస్థితుల్లో మున్సిపల్ అధికారులు, సిబ్బంది చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డికి సహాయ నిరాకరణ చేస్తున్నారు. సోమవారం కార్యాలయంలో ఆసక్తికరమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి.
మున్సిపల్ చైర్మన్ హోదాలో అధికారులు, సిబ్బందికి చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి సోమవారం సమావేశం ఏర్పాటు చేస్తే మూకుమ్మడిగా సిబ్బంది అంతా గైర్హాజరు కావడం చైర్మన్ జేసికి ఆగ్రహం తెప్పించింది. దీనిపై జేసి ప్రభాకరరెడ్డి వినూత్నంగా నిరసన తెలియజేశారు. సోమవారం కార్యాలయంలో చైర్మన్ సమావేశం ఏర్పాటు చేయగా, అదే సమయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి కరోనా వైరస్ మూడవ దశపై అవగాహన ర్యాలీ, సమావేశం ఏర్పాటు చేశారు. దీంతో సిబ్బంది, అధికారులు ఎమ్మెల్యే ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని చైర్మన్ ఏర్పాటు చేసిన సమావేశానికి డుమ్మ కొట్టారు. ఆ తరువాత అయినా మున్సిపల్ కార్యాలయానికి వస్తారని జెసి ఎదురుచూసినా వారు అటునుండి అటే వెళ్లిపోయారు.
దీంతో మున్సిపల్ సిబ్బంది వచ్చే వరకూ కార్యాలయం వదిలివెళ్లేది లేదంటూ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి కార్యాలయంలోనే బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం రాత్రి మున్సిపల్ కార్యాలయంలోనే బస చేశారు. రాత్రి అక్కడే భోజనం చేశారు. మరో పక్క మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాదరెడ్డి చైర్మన్ అనుమతి లేకుండానే సెలవు పెట్టి వెళ్లారు. సోమవారం సిబ్బంది అధికారులు కార్యాలయ విధులకు రాకపోవడం, అటిండెన్స్ రిజిస్టర్ లో సంతకాలు చేయకపోవడంతో కార్యాలయానికి చెందిన 26 మంది సిబ్బంది కనిపించడం లేదంటూ చైర్మన్ జేసి ప్రభాకరరెడ్డి తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పరిస్థితి రసవత్తరంగా మారిది.