ఏపిలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ నుండి పవన్ యాత్ర అన్నవరం పుణ్యక్షేత్రం నుండి ప్రారంభం అవుతోంది. పవన్ కళ్యాణ్ మొదటి దశ ప్రచార వివరాలను ఆ పార్టీ నేత నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. పవన్ కళ్యాణ్ వారాహి వాహనంతో ప్రచారం చేయడంపై ఈరోజు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో గోదావరి జిల్లాల నేతలతో సమావేశమైయ్యారు. త్వరలో ప్రారంభం కానున్న పవన్ కళ్యాణ్ యాత్రపై సమావేశంలో చర్చించారు. ఈ నెల 14వ తేదీ నుండి వారాహి పై పవన్ ప్రచార యాత్ర ప్రారంభం అవుతుందనీ, తొలి విడత తూర్పు గోదావరి జిల్లా అన్నవరం క్షేత్రంలో ప్రారంభమై భీమవరం వరకూ కొనసాగుతుందని తెలిపారు. ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, రాజోలు, పి గన్నవరం, నరసాపురం నియోజకవర్గాల్లో యాత్ర జరుగుతుందని నాదెండ్ల మనోహర్ చెప్పారు.
పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఖరారు అయినట్లు ప్రకటన రావడంతోనే అధికార వైసీపీ నుండి విమర్శల పర్వం మొదలైంది. షూటింగ్ లు లేకే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు సిద్దమైయ్యారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని విమర్శించారు. వారాహి మీద పవన్ ది టూర్ ప్యాకేజీనా అని అడిగారు. వారాహికి ఇన్ని రోజులు ఎందుకు బ్రేక్ ఇచ్చారని ప్రశ్నించారు. దసరా పోయింది.. సంక్రాంతి వెళ్లింది.. ఉగాది వెళ్లిన ఇన్నాళ్లకు యాత్ర గుర్తొచ్చిందా అని ప్రశ్నించారు.
అన్నవరం, భీమవరం కన్నా చంద్రవరం యాత్ర అని మొదలు పెడితే బాగుంటుందని వ్యంగ్యంగా విమర్శించారు. సినిమా ప్రారంభోత్సవం రోజున ఇలానే తెగ హడావుడి ఉంటుందన్నారు. మువీ అద్భుతంగా ఉంటుందని చెబుతారనీ ఆ తర్వాత దాని ఊసే ఉండదని అన్నారు. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలి కూడా అలాగే ఉందన్నారు పేర్ని నాని. మంత్రి అంబటి రాంబాబు కూడా పవన్ కళ్యాణ్ యాత్రపై స్పందించారు. అసలు ఇప్పటి వరకూ పవన్ కళ్యాణ్ యాత్ర ఎందుకు ప్రారంభం కాలేదని ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ను నమ్మి జన సైనికులు మోస పోతారని, జాగ్రత్త అంటూ సూచించారు.
Pawan Kalyan: ఏపిలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్రకు మూహూర్తం ఫిక్స్.. ఎప్పటి నుండి అంటే..?