ఏపి ప్రభుత్వం రాష్ట్రంలో కుక్కలు, పందుల పెంపకం దారులకు షాకింగ్ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పందుల పెంపకం దారులు ఉంటారు. వారు ఇంత వరకూ పందులకు లైసెన్సులు తీసుకోవడం లేదు. అదే విధంగా రాష్ట్రంలో ఊర కుక్కలు, పెంపుడు కుక్కలు ఉన్నాయి. పెంపుడు కుక్కలకు గతంలో ఎప్పుడో లైసెన్సులు తీసుకునే పరిస్థితి ఉండేది. కానీ దశాబ్దాల కాలంగా పెంపుడు కుక్కలకు ఎవరూ లైసెన్సులు తీసుకుంటున్న దాఖలాలు లేవు.
అయితే ప్రస్తుతం ఏపి ప్రభుత్వం కొత్తగా కుక్కలు, పందులకు విధిగా లైసెన్సులు తీసుకోవాలంటూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నేడు దీనికి సంబంధించి ఓ జివో విడుదల చేసింది. లైసెన్స్ లేని కుక్కలు, పందులను అధికారులు పట్టుకుంటే రూ.500 జరిమానాతో పాటు రోజుకు రూ.250లు అపరాధ రుసుము వసూలు చేయాలని జివోలో పేర్కొంది. అధికారులు స్వాధీనం చేసుకున్న కుక్కలు, పందులను అవి తమవి అని యజమానులు చెప్పకపోతే (అంగీకరించకపోతే) వాటిని వీధి కుక్కలు, పందులుగా పరిగణించి కుటుంబ నియంత్రణ చికిత్స చేయాలని ఉత్తర్వులో వెల్లడించింది. లైసెన్సు గడువు ముగిసిన తరువాత పది రోజుల్లోగా తిరిగి లైసెన్సు పొందాలని ఆదేశాలలో పేర్కొంది.
కుక్కలు, పందుల పెంపకం దారులు లైసెన్సు తీసుకోవాలంటే ఆయా స్థానిక సంస్థలు నిర్ధేశించిన లైసెన్సు రుసుము చెల్లించాలి. లైసెన్సు పొందాలంటే ముందుగా కుక్కలు, పందుల యజమానులు వాటి హెల్త్ సర్టిఫికెట్ అందజేయాలని ఉత్తర్వులో స్పష్టం చేసింది. కుక్కలు, పందుల విషయంలో హెల్త్ సర్టిఫికెట్ ప్రభుత్వ పశువైద్యాధికారుల నుండి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి గ్రామ పంచాయతీల్లో కుక్కలు, పందుల యజమానులకు ఇకపై టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఆ టోకెన్ లను పెంపుడు జంతువుల మెడ చుట్టూ నిరంతరం వేలాడేలా ఉండాలని ఆదేశించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, రూరల్ డవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేది ఆదేశాలు జారీ చేశారు.