ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలుగు బాషాభిమానులను కుషీ చేశారు. కరోనా వ్యాక్సిన్ ప్రారంభోత్సవం సందర్భంగా మోడీ..మహాకవి గురజాడ అప్పారావును గుర్తు చేస్తూ ఆయన రాసిన “దేశ మంటే మట్టికాదోయ్..దేశ మంటే మనుషులోయ్, సొంత లాభం కొంత మానుకుని గట్టిమేలు తల పెట్టవోయ్” అనే గేయాన్ని ఉచ్చరించడం తెలుగు భాషాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
జాతీయ భాష హిందీలో మోడీ ప్రసంగిస్తూ మధ్యలో గురజాడ రాసిన తెలుగు గేయాన్ని చెబుతూ ఆ స్పూర్తితో ముందుకు కొనసాగాలని పిలుపు నివ్వడం తెలుగు రాష్ట్ర ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. వివిధ తెలుగు పండుగల సందర్భంలోనూ మోడి ట్విట్టర్ వేదికగా తెలుగు భాషలోనే శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేస్తుండటం తెలిసిందే. ఇప్పుడు తాజాగా తన ప్రసంగంలోనూ తెలుగు మహాకవిని గుర్తు చేసుకోవడం, ఆయన రాసిన గేయాన్ని ఉచ్చరించి తెలుగు ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. మోడి నోట గురజాడ మాట రావడం, తెలుగులోని సూక్తి వినిపించడంతో తెలుగు ప్రజలు కుషీ అయ్యారు. తెలుగు భాష గొప్పతనానికే ఇది ప్రతీక అని పేర్కొంటున్నారు.
ఆంధ్ర భోజునిగా, కన్నడ రాజ్య రమారమణగా కీర్తించబడిన శ్రీ కృష్ణదేవ రాయలు.. తెలుగు భాషకు దేశ భాషలందు ఉన్న ప్రాముఖ్యత దృష్ట్యా “తెలుగ దేలయన్న దేశంబు తెలుగేను.. తెలుగు వల్లభుండ తెలుగొకండ..ఎల్లవారు వినగ ఎరుగవే బాసాడి..దేశ భాషలందు తెలుగు లెస్స” అని కీర్తించారని తెలుగుభాషభిమానులు అంటున్నారు.