ఏపి బీజేపీ నేతల్లో కోల్డ్ వార్ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు సోము వీర్రాజుకు అనుకూల, వ్యతిరేక వర్గాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సోము వ్యతిరేకులకు సమయం వచ్చినప్పుడల్లా ఆయన పరువు తీసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. పార్టీలో అంతర్గతంగా జరిగే వ్యవహారాలను బయటకు తెలియజేస్తూ ఉన్నారు కొందరు సోము వ్యతిరేకులు. సోము వీర్రాజు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా ఎన్నికైనప్పటి నుండి ఆయన తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలపై పలువురు సీనియర్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఆ సమయంలోనే పార్టీ కేంద్ర నాయకత్వానికి సోము తీరుపై ఫిర్యాదులు కూడా చేసినట్లు వార్తలు వచ్చాయి. ఆక్రమంలోనే ఏపిలో ఏకపక్ష నిర్ణయాలకు అవకాశం లేకుండా పార్టీ అధిష్టానం కోర్ కమిటీని ఏర్పాటు చేసింది. పార్టీకి సంబంధించి ఏ నిర్ణ యాలు అయినా కోర్ కమిటీలో చర్చించే నిర్ణయాలను తీసుకోవాలని సూచించింది.
కోర్ కమిటీలో అధ్యక్షుడు సోము వీర్రాజు తో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి దుగ్గుబాటి పురందేశ్వరి, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నర్శింహరావు, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేశ్, జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) మధుకర్, ఎమ్మెల్సీ మాధవ్, మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు చంద్రమౌళి, రేలంగి శ్రీదేవి ఉన్నారు. వీరితో పాటు ప్రత్యేక అహ్వానితులుగా పార్టీ సంస్థాగత వ్యవహారాల జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పర్యవేక్షకుడు శివప్రకాశ్, కేంద్ర మంత్రి, రాష్ట్ర ఇన్ చార్జి వి మురళీధరన్, సునీల్ ధేవధర్ లు ఉన్నారు. అయితే కోర్ కమిటీ ఉన్నప్పటికీ పార్టీ లో ఏమిజరుగుతుందో చాలా మందికి తెలియడం లేదంటూ ఇటీవల మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కామెంట్స్ చేయడం పార్టీలో సంచలనం అయ్యింది. పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి తప్పుకుంటే దానికి సోము వీర్రాజు వ్యవహార తీరే కారణం అన్నట్లుగా కన్నా వ్యాఖ్యానించారు.
అసలు బీజేపీలో రెండు మూడు రకాల నేతలు ఉన్నట్లుగా అందరూ అనుకుంటుంటారు. వీరిలో వైసీపీకి అనుకూల బీజేపీ నేతలు, టీడీపీ అనుకూల బీజేపీ నేతలు, ఇతర పార్టీలతో ఎటువంటి సంబంధం లేకుండా ఆర్ఎస్ఎస్ భావాలతో కొనసాగే బీజేపీ నేతలు. ఇలా మూడు రకాల నేతలు ఉన్నారని టాక్. సోము వీర్రాజు మొదటి నుండి వైసీపీకి కాస్త అనుకూలంగా టీడీపీకి బద్ద విరోధిగా వ్యవహరిస్తూ వచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు విషయంలో ఘాటుగా విమర్శించే సోము వీర్రాజు.. వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ విషయంలో కాస్త వేడి తగ్గించి విమర్శలు చేసేవారు. దీంతో టీడీపీ అనుకూల మీడియాల్లో సోముకు సంబందించి ఏ చిన్న వ్యతిరేక వ్యవహారం దొరికినా హైలెట్ చేయడం జరుగుతోంది. తనను టార్గెట్ గా చేసుకుని వార్తలు రాస్తున్న నేపథ్యంలో ఏబీఎన్, ఆంధ్రజ్యోతిని బీజేపీ బహిష్కరిస్తుంది అన్నట్లుగా కూడా గతంలో సోము వీర్రాజు హెచ్చరించారు. తాజాగా మోడీ విశాఖ పర్యటనలో సోము వీర్రాజు పరువు గంగలో కలిపే ఓ సన్నివేశం కోర్ కమిటీ భేటీలో ఆవిష్కృతం కావడం, దాన్ని వ్యతిరేక పక్షం వారు మీడియాకు చేరవేయడం జరిగాయి.
ఇంతకు కోర్ కమిటీ మీటింగ్ లో ఏమిజరిగింది అంటే…ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోర్ కమిటీ సభ్యుల్లో తనకు పరిచయం ఉన్న వారిని పేరుపేరుగా పలకరిస్తూ సోము వీర్రాజు వద్దకు వచ్చిన సమయంలో ఆప్ కా నామ్ క్యాహై..అని ప్రశ్నించారుట. సెల్ప్ ఇంట్రడ్యూస్ కరో (మిమ్మల్ని పరిచయం చేసుకోండి) అని అన్నారని దీంతో సోము ఖంగుతిన్నారుట. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినే ప్రధాని గుర్తించకపోవడం తో అక్కడ ఉన్న వారంతా ఆశ్చర్యానికి గురైయ్యారు. షాక్ నుండి కోరుకున్న తర్వాత తన పేరు సోము వీర్రాజు, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని అంటూ పరిచయం చేసుకోగా, రాజకీయం కాకుండా వేరే ఏమి చేస్తారు అని ప్రశ్నించారుట ప్రధాని మోడీ. వ్యవసాయం, వ్యాపారం వగైరా అన్నట్లుగా ప్రశ్నిస్తే ఏమి లేదు సార్ అని సోము బదులు ఇచ్చారుట.
ఇదే క్రమంలో ఎమ్మెల్సీ మాధవ్ వద్దకు వచ్చే సరికి ఆయన తండ్రి చలపతిరావు ఆరోగ్యం గురించి ఆరా తీశారుట. తదుపరి రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయని మోడీ ప్రశ్నించగా సోము వీర్రాజు 21 అని చెప్పడంతో పక్కన ఉన్న నేతలు 26 అని చెప్పారుట. అక్కడ అంతర్గతంగా జరిగిన వ్యవహారం మొత్తం పూసగుచ్చినట్లుగా సోము వ్యతిరేకులు మీడియాకు లీక్ చేసేశారు. అయితే దీనిపై సోము వీర్రాజు నేరుగా స్పందించలేదు కానీ పరోక్షంగా కాళోజీ సూక్తిని ట్విట్ చేశారు. “వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అక్షరాలను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేసే కొంత మంది వ్యక్తుల జీవితాలను, వారి మానసిక స్థితిని తెలియజేసే అద్భుతమైన మాటలు” అంటూ .. “అక్షరాలను అడ్డుగా పెట్టుకుని ఎదిగిన వారు ఎందరో ..అక్షరాలనే ఆత్మగా చేసుకుని బతికిన వారు కొందరే” అన్న కాళోజీ సూక్తిని ట్విట్టర్ లో పోస్టు చేశారు సోము వీర్రాజు.
వాస్తవ పరిస్థితులకు అద్దం పడుతూ, అక్షరాలను అడ్డుపెట్టుకుని వ్యవస్థలను నిర్వీర్యం చేసే కొంతమంది వ్యక్తుల జీవితాలను , వారి మానసిక స్థితిని తెలియజేసే అద్భుతమైన మాటలు 🙏.#Waytonews pic.twitter.com/W7uN3sJHuH
— Somu Veerraju / సోము వీర్రాజు (@somuveerraju) November 13, 2022