ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ విశాఖ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. విశాఖలో రూ.10,742 కోట్లతో చేపట్టనున్న పలు ప్రాజెక్టులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయడంతో పాటు ఇప్పటికై దాదాపు రూ.500 కోట్లతో పూర్తి అయిన పలు ప్రాజెక్టులను జాతికి అంకితం చేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాన మంత్రి మోడీ బస చేసిన ఐఎన్ఎస్ చోళ గెస్ట్ వద్ద కు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం వైఎస్ జగన్ లు చేరుకుని మోడీని కలిశారు. 10.15 గంటలకు వీరు ముగ్గురూ హెలికాఫ్టర్ లో మద్దిలపాలెం జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సభాస్థలికి చేరుకుంటారు.
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 40 నిమిషాల సేపు ప్రసంగించనున్నారు. మోడీ బహిరంగ సభ విజయవంతం కోసం ఇటు వైసీపీ, అటు బీజేపీ ఉత్తరాంధ్ర జిల్లాల నుండి దాదాపు 3లక్షల మందిని తరలిస్తున్నారు. జనాల తరలింపునకు నాలుగు వేల బస్సులు, పెద్ద సంఖ్యలో వాాహనాలను ఏర్పాటు చేశారు. ఏపిలో రాజధాని అంశం హాట్ టాపిక్ నడుస్తొంది. విశాఖ ను పరిపాలనా రాజధానిగా చేయనున్న కృత నిశ్చయంతో వైసీపీ ప్రభుత్వం ఉంది. ఆ దిశగా అడుగులు వేస్తొంది. ఇటీవల వైసీపీ, జేఏసీ ఆధ్వర్యంలో ఉత్తరాంధ్రలో విశాఖను రాజధాని చేయాలంటూ రౌండ్ టేబుల్ సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. ఈ తరుణంలో ప్రధాని మోడీ విశాఖలో చేసే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరో పక్క ప్రదాని మోడీ పర్యటన నేపథ్యంలో పోలీసులు విస్తృత పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు. దాదాపు 8500 మంది పోలీసులు, అధికారులు బందోబస్తు విదుల్లో ఉన్నారు. భారీగా తరలివచ్చిన జనాలతో మద్దిలపాలెం జంక్షన్, ఏయు ఇంజనీరింగ్ కళాశాల మైదానం జనసంద్రంగా మారింది.