YS Viveka Case: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారికి బిగ్ షాక్ తగిలింది. సీబీఐ అధికారి పై కడప రిమ్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో తనను విచారణ పేరుతో సీబీఐ అధికారి రామ్ సింగ్ వేధిస్తున్నారంటూ పులివెందులకు చెందిన ఉదయ్ కుమార్ రెడ్డి కడప జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ను విచారించిన జిల్లా కోర్టు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సిందిగా పోలీసు శాఖను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు కడప రిమ్స్ పోలీసులు సీబీఐ అధికారి రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు.
YS Viveka Case: సీబీఐ అధికారిపైనే కేసు నమోదు
వివేకా హత్య కేసులో అనుమానితుడుగా ఉదయ్ కుమార్ ను సీబీఐ అధికారులు పలు మార్లు విచారించారు. ఉదయ్ కుమార్ రెడ్డి యూరేనియం కార్పోరేషన్ ఉద్యోగిగా పని చేస్తున్నారు. ఇటీవలే ఉదయ్ కుమార్ రెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో అదనపు ఎస్పీని కలిసి సీబీఐ అధికారులపై ఫిర్యాదు చేశారు. వివేకా హత్య కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనీ, వారు చెప్పినట్లు చెప్పకపోతే కుటుంబం మొత్తాన్ని కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆపీసులో, ఇంటి వద్ద అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా వివేకా హత్య కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్న తరుణంలో సీబీఐ అధికారిపైనే కేసు నమోదు కావడం హాట్ టాపిక్ గా మారింది.