Police : పోలీసులే అవాక్కయ్యే హత్యలు , విచారణలో అంతకంటే షాకింగ్ నిజాలు, మాటలు. ఇది తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్యల ఉదంతంలో నిందితుల వైఖరి.
మదనపల్లి జంట హత్యల కేసులో విచారణ కొనసాగుతున్న కొద్దీ ఆశ్చర్యకర నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. అదే సమయంలో విస్మయకరమైన అంశాలు తెరమీదకు వస్తున్నాయి.
ఇంత దారుణం జరిగింది…
తల్లిదండ్రులు అఘాయిత్యానికి కన్నుమూసిన అక్క చెల్లెళ్లు అలేఖ్య, సాయి దివ్యలు కుక్కను తీసుకుని బయటకు వెళ్లినప్పుడు దారిలో ఎవరో దిష్టి తీసి ఉంచిన నిమ్మకాయలు, మిరపకాయలను తొక్కారు. ఆ రోజు నుంచి వారి మానసిక పరిస్థితి సరిగా లేదు. సాయిదివ్య తాను చనిపోతాననే భావనలో ఉండేది. అలేఖ్య కూడా అవును అని ఆమెకు సపోర్ట్ చేసేది. ఈ నేపథ్యంలో ఈ నెల 23న తల్లిదండ్రులు కూతుళ్లిద్దరికీ ఓ మంత్రగాడి చేత తాయత్తు కట్టించారు. మరుసటి రోజు సాయిదివ్య తాను చనిపోతానని బిగ్గరగా ఏడుస్తుంటే…తల్లిదండ్రులు వచ్చి వేపకొమ్మలతో కొట్టారు. ఈ క్రమంలో ఆ అమ్మాయి మరింత బిగ్గరగా ఏడ్చింది. దాంతో పట్టిన దెయ్యం వదలాలంటే మరింత గట్టిగా కొట్టాలని భావించి పక్కనే ఉన్న డంబెల్తో తలపై కొట్టి నుదుటిపై కత్తితో పొడిచారు. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో సాయిదివ్య ప్రాణాలు కోల్పోయింది.
Police : తల్లిదండ్రుల షాకింగ్ వ్యాఖ్యలు…
కుమార్తెలను చంపిన ఉదంతంలో నిందితులు ఇద్దరినీ అరెస్ట్ చేసి రిమాండుకు తరలించిన పోలీసులు విచారణ చేస్తుండగా తల్లి పద్మజ ఆశ్చర్యకర విషయాలను చెప్తోంది. “ఎందుకు ఇంత గొడవ చేస్తున్నారు. మేమేమీ కావాలని చేయలేదు.. దేవుడే మా చేత చేయిస్తున్నాడు.. ఆయన చెప్పిన ప్రకారమే నడుచుకుంటున్నాము“ అంటూ ఆశ్చర్యపోయే కామెంట్లు చేస్తోంది. “నా పెద్ద కుమార్తె శివుడు, చిన్న కుమార్తె పార్వతి. నేను కాళికను“ అంటూ ఆమె పోలీసులకు సమాధానం ఇస్తోంది. బిడ్డలను నిష్కారణంగా తమ చేతులతో తామే చంపేసుకున్నామన్న భావన కించిత్ కూడా లేదు. పైగా దానికి ప్రేరణ దేవుడే అంటూ సమర్థిస్తున్నారట. వారు ఎన్ని సార్లు ప్రశ్నించినా ఇదే సమాధానం వస్తుందట.