అనంతపురం జిల్లాలో గత కొన్ని నెలలుగా రాజకీయ వాతావరణం హీట్ ఎక్కుతోంది. తరచు వైసీపీ, టీడీపీ నేతల మధ్య వివాదాస్పద విమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఉద్రిక్తతలకు దారి తీస్తున్నాయి. ఇటీవలే అనంతపురం జిల్లాకు చెందిన దివంగత మాజీ మంత్రి పరిటాల రవిపై హిందూపురం వైసీపీ పార్లమెంట్ సభ్యుడు గోరంట్ల మాధవ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ సంచలనంగా, ఉద్రిక్తతకు కారణం అయ్యాయి. పరిటాల రవిని ఓ రక్త పిపాసిగా గోరంట్ల అభివర్ణిస్తూ.. జిల్లాలో ఎంతో మంది పేదల బతుకులను దోచుకున్నాడనీ, సాగు భూముల్లో రక్తాన్ని పారించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాధవ్ విమర్శలపై టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ తీవ్రంగా స్పందిస్తూ కౌంటర్ లు ఇచ్చారు.
అనంత జిల్లాలో మాధవ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు, శ్రీరాం స్పందనలు ఒక రకంగా ఉద్రిక్తతలకు, రాజకీయ సంచలనాలకు దారి తీశాయి. ఇక తాడిపత్రి నియోజకవర్గంలో మొదటి నుండి టీడీపీ, వైసీపీ మధ్య తరచు వివాదాలు జరుగుతునే ఉన్నాయి. రెండు నెలల క్రితం మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకరరెడ్డి అరెస్టు క్రమంలో టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య ఘర్షణలు జరగడం, ఉద్రిక్తతలకు దారి తీయడం తెలిసిందే.
ఇప్పుడు తాజాగా తన కుటుంబంపై జెసి వర్గీయుడు సోషల్ మీడియాలో అసభ్య పోస్టు పెట్టారంటూ వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వయంగా తన అనుచరులతో ఏకంగా జెసి ప్రభాకరరెడ్డి ఇంటిపైకి దూసుకువెళ్లడం రాజకీయ సంచలనంగా, తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. తాడిపత్రిలో జెసి ఇంటిపై దాడి జరగడం ఇదే ప్రధమం. గతంలో రాజకీయ నేతలు పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి కానీ ఇంటిపైకి వచ్చి దాడి చేయడంతో జేసీ ప్రభాకరరెడ్డి అగ్గిలంమీద గుగ్గిలం అవుతున్నారు. ఈ పరిణామంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏమి జరుగుతుందో అన్న భయాందోళనలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందస్తు చర్యలో భాగంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. తాడిపత్రిలో అడుగడుగునా పెద్ద ఎత్తున పోలీస్ బలగాలను మోహరించారు. ఈ పరిణామాలతో అనంత పరిస్థితి అంతేనా? ఇక మారదా, ఇక తాడిపత్రి పరిస్థితి కూడా ఇంతేనా? మారదా? అనే పరిస్థితికి వచ్చింది.