ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని నమ్ముకున్న మరో సినీ నటుడు పోసాని కృష్ణమురళికీ న్యాయం చేశారు. ఇటీవలే ప్రముఖ సినీ హస్య నటుడు ఆలీకి ప్రభుత్వ సలహదారు (ఎలక్ట్రానిక్ మీడియా) పదవి ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సినీనటుడు పోసాని కృష్ణమురళికి ప్రభుత్వంలో సముచిత స్థానం కల్పించారు సీఎం వైఎస్ జగన్. ఏపి ఫిలిం డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణమురళి నియమితులైయ్యారు. ఈ మేరకు గురువారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పోసాని నియామకం తక్షణమే అమలులోకి వస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
గత ఎన్నికల సమయంలో వైసీపీ తరపున ప్రచారం చేసిన సినీనటుల్లో ఆలీతో పాటు పోసాని కృష్ణమురళి కూడా ఉన్నారు. ఆలీకి ప్రభుత్వ పదవి లభించడంతో పోసానికి కూడా పదవి వస్తుందని భావించారు. అనుకున్నట్లుగానే పోసానికి పదవి లభించింది. మంచు మోహన్ బాబు కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ప్రచారంలో భాగస్వామ్యం అయినప్పటికీ సీఎం జగన్మోహనరెడ్డి సీఎం అయిన తర్వాత ఆయన కలవకపోవడంతో పాటు బీజేపీకి దగ్గర అయ్యే ప్రయత్నాలు చేశారు. ప్రధాని మోడీ వద్దకు వెళ్లడం, తాను బీజేపీకి అనుకూలమని చెప్పడం, ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో సీఎం జగన్ ను కొందరు అధికారులు తప్పుదోవపట్టిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేయడం లాంటి వల్ల వారి ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లుగా వార్తలు వినబడుతున్నాయి.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మోహన్ బాబుకు టీటీడీ చైర్మన్ గానీ లేక రాజ్యసభ పదవి గానీ ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ వార్తలను మోహన్ బాబు కొట్టిపారేశారు. తాను ఏ పదవి ఆశించడం లేదని చెప్పుకొచ్చారు. గతంలో సినీ రంగం నుండి పృద్వికి అవకాశం ఇచ్చారు సీఎం జగన్. ఎస్వీబీసీ చైర్మన్ గా అవకాశం కల్పించగా, కొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆయన ఆ పదవి నుండి తప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఆ తర్వాత వైసీపీకి దూరమైయ్యారు పృద్వి.