ప్రకాశం Prakasam జిల్లా సింగరాయకొండ Singarayakonda శ్రీ లక్ష్మీనరసింహస్వామి స్వాగత ద్వారంపై ఉన్న మూడు విగ్రహాలు దెబ్బతిన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల విజయనగరం Vijayanagaram జిల్లా రామతీర్ధంలో కోదండ రాముడి విగ్రహానికి ఆ తరువాత కృష్ణా జిల్లా విజయవాడ Vijayawada లో సీతమ్మ విగ్రహాలకు అపచారం జరిగిన నేపథ్యంలో సింగరాయకొండలో ఆలయ స్వాగత ద్వారంపై ఉన్న మూడు విగ్రహాలు దెబ్బతినడంతో ఇది కూడా ఎవరో చేసి ఉంటారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీనిపై వెంటనే ప్రకాశం జిల్లా జిల్లా అడిషనర్ ఎస్పీ (అడ్మిన్) బి రవిచంద్ర స్పందించారు.
తుప్పుపట్టే విగ్రహం చేతులు విరిగి పడ్డాయి
శ్రీకృష్ణదేవరాయల కాలంలో సింగరాయకొండలో శ్రీ లక్ష్మీ నర్శింహస్వామి ఆలయం నిర్మించారని అడిషనల్ ఎస్పీ రవిచంద్ర పేర్కొన్నారు. ఆ ఆలయానికి అనుసంధానంగా పట్టణంలో రెండు కిలో మీటర్ల దూరంలో సుమారు 20 సంవత్సరాల క్రితం సిమెంట్ తో స్వాగత ద్వారం నిర్మించారని దానిపై లక్ష్మీనర్శింహస్వామి, రాజ్యలక్ష్మి అమ్మవారు, గరుత్మంతుడు విగ్రహాలు ఏర్పాటు చేశారు. రెండు దశాబ్దాలుగా ఆ విగ్రహాలు ఎండకు ఎండి, వానకు తడవటం వల్ల తప్పు పట్టాయి. ఈ క్రమంలో ఆ విగ్రహాల చేతులకు తుప్పు పట్టడం వల్ల విరిగి కింద పడిపోయాయని అడిషనల్ ఎస్ పి రవిచంద్ర తెలిపారు.
ఈ ఏడాది మరమత్తులు చేయలేదు
ప్రతి సంవత్సరం ఈ స్వాగత ద్వారానికి దాతల సహకారంతో ఆలయ అధికారులు మరమ్మత్తులు చేయడం జరుగుతోంది. కానీ ఈ ఏడాది కరోనా కారణంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించకపోవడంతో స్వాగత ద్వారం మరమ్మత్తులు కూడా చేయలేదని ఆయన చెప్పారు. స్వాగత ద్వారంపై ఉన్న దేవుడి విగ్రహాలకు తుప్పు పట్టడం వల్లనే చేతులు విరిగి కిందపడ్డాయని ఆలయ ఇఓ బైరాగి తెలియజేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి నిజాలు తెలియకుండా అవాస్తవాలు ప్రచారం చేసి శాంతిభద్రతలకు విఘాతం కల్గించే వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన హెచ్చరించారు. ప్రజలు ఇటువంటి వదంతులు నమ్మవద్దని అడిషనల్ ఎస్పీ సూచించారు.