Prision: నేరాల్లో పిహెచ్డీ డిగ్రీ అనేది ఇచ్చేది ఉంటే అది ఇతనికి ఇవ్వాల్సిందే. వయసు 25 ఏళ్లే కానీ అతను చేసిన నేరాల చిట్టా చాలా పెద్దది. 28 సార్లు వివిధ నేరాల్లో అరెస్టు అయి రికార్డు సృష్టించాడు. తాజాగా నెల్లూరు జిల్లా రావూరు పోలీసులు ఇతన్ని మరో సారి అరెస్టు చేశారు. అతని వద్ద నుండి 11 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, రూ.40వేల నగదు, ఓ ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
విషయంలోకి వెళితే…కులవాయి మండలం వెరుబొట్లపల్లికి చెందిన గోగుల శివయ్య 16 ఏళ్ల వయస్సులోనే వ్యసనాలకు బానిస అయ్యాడు. విలాస జీవితం గడపాలన్న మోజుతో ఆ వయస్సులోనే ఓ దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డాడు. అయితే అనుభవం లేకపోవడంతో వెంటనే పోలీసులకు చిక్కాడు. వారు అతన్ని తిరుపతి జువైనల్ హోమ్ కు తరలించారు. ఆ తరువాత అక్కడ నుండి విడుదల అయి బయటకు వచ్చిన తరువాత తీరు మార్చుకోలేదు. రాత్రి సమయంలో వాహనంపై తిరుగుతూ తాళం వేసిన ఇళ్లనే లక్ష్యంగా చేసుకుని దొంగతనాలకు పాల్పడేవాడు. జిల్లా వ్యాప్తంగా నేరాలకు పాల్పడ్డాడు. దాదాపు 28 నేరాల్లో అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ క్రమంలో అతనిపై కలువాయి పోలీస్ స్టేషన్ లో రౌడీషీట్ కూడా తెరిచారు.
ఇటీవల జిల్లా వ్యాప్తంగా జరిగిన వరుస దొంగతనాలపై ప్రత్యేక దృష్టి పెట్టిన వెంకటగిరి ఇన్స్పెక్టర్ ఎన్ నాగమల్లేశ్వరరావు..ప్రత్యేక టీమ్ లను ఏర్పాటు చేసి ముమ్మర గాలింపు చర్యలు చేపట్టి శివయ్యను ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి రావూరు. డక్కిలి, చేజర్ల, మునుబోలు, సంగం పోలీస్ స్టేషన్ ల పరిధిలో నమోదైన 8 కేసులకు సంబంధించి రూ. 11 లక్షల విలువైన బంగారు అభరణాలను, 40వేల నగదును, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ యువకుడి నేరాల చిట్టాను జిల్లా ఎస్పీ భాస్కర్ భూషణ్ వెల్లడించారు. తప్పించుకుని తిరుగుతూ వరుస నేరాలకు పాల్పడుతున్న శివయ్యను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్న పోలీసు సిబ్బందిని ఆయన అభినందించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?