వివేకా హత్య కేసులో దర్యాప్తును ఓ పక్క సీబీఐ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరో పక్క ఈ కేసులో నిందితుడుగా సీబీఐ అరెస్టు చేసిన దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి భార్య తులశమ్మ తొమ్మిది నెలల క్రితం వివేకా కుటుంబ సభ్యులపైనే ఆరోపణలు చేస్తూ పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై పులివెందుల కోర్టులో తులశమ్మ వాంగ్మూలం ఇచ్చారు. వివేకా హత్య కేసు దర్యాప్తులో సీబీఐ పలు అంశాలను పరిగణలోకి తీసుకోలేదని తులశమ్మ ఆరోపించారు. మరో ఆరుగురుని సీబీఐ విచారించాలని సీబీఐని తులశమ్మ కోరారు. వివేకా హత్య కేసులో ఆర్ధిక అంశాలు, కుటుంబ వివాదాలు ముడిపడి ఉన్నాయనీ, ఆ అంశాలను పరిగణలోకి తీసుకోవాలని ఆమె కోరారు.
వివేకా అల్లుడు రాజశేఖరరెడ్డి, బావమరిది శివప్రసాద్ రెడ్డి, పరమేశ్వరరెడ్డి, బీటెక్ రవి, రాజశేఖరరెడ్డి, నీరుగట్టు ప్రసాద్ లను విచారించేలా ఆదేశాలు ఇవ్వాలని తులశమ్మ కోరారు. తులశమ్మ గత ఫిబ్రవరి 21న పులివెందుల కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, తొమ్మిది నెలల తర్వాత వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో విచారణలో భాగంగా పులివెందుల కోర్టు ఎటువంటి ఆదేశాలు ఇస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం దేవిరెడ్డి శివశంకరరెడ్డి కడప జైలులోనే ఉన్నారు.
2019 ఎన్నికలకు ముందు పులివెందులలో వైఎస్ వివేకానంద రెడ్డి దారుణ హత్యకు గురైయ్యారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. ఈ కేసు దర్యాప్తునకు అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆ తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహనరెడ్డి సర్కార్ పాత సిట్ ను రద్దు చేసి వేరే సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ కేసులో అసలైన దోషులను పట్టుకోవడంలో జాప్యం జరగడంతో వివేకా కుమార్తె సునీత హైకోర్టును ఆశ్రయించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాల మేరకు సీబీఐ దర్యాప్తు చేపట్టి ఈ కేసులో ప్రత్యక్షంగా పాల్గొన్నట్లుగా భావిస్తున్న నిందితులను అరెస్టు చేసింది. ఈ కేసులో వివేకా డ్రైవర్ దస్తగిరి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే.