purandeswari దగ్గుబాటి పురంధేశ్వరి… బీజేపీ సీనియర్ నేత . ఏపీ రాజకీయాల్లో పార్టీలో ఉన్న ముఖ్య నేతల్లో ఆమె ఒకరు. గత కొద్దికాలంగా విశాఖ స్టీల్ ప్లాంట్ అంశం ఏపీ రాజకీయాల్లో కాక రేపుతోంది.
రాజకీయ పార్టీలతో సంబంధం అన్ని రాజీనామాలు, దీక్షలు, ధర్నాలు, ఆందోళనలతో పార్టీలు, ప్రజాసంఘాలు కదం తొక్కుతున్నాయి. ఈ నిర్ణయం విషయంలో ప్రధానంగా టార్గెట్ అయిన భారతీయ జనతా పార్టీ నేతలు కూడా ఢిల్లీ బాట పట్టి కేంద్ర మంత్రులను కలిసి.. ప్రజల మనోభావాలను తెలియజేస్తూ.. కొన్ని ప్రతిపాదనలు కూడా చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే, ఈ కామెంట్లపై కొత్త చర్చ మొదలైంది.
purandeswari : చిన్నమ్మ మాట ఇది…
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో జరుగుతున్న విషయాలను కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దృష్టికి తీసుకెళ్లినట్టు పురంధేశ్వరి తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఆధారపడిన చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఉద్యోగుల భవిష్యత్ పై చర్చించామన్న ఆమె.. ప్రభుత్వానికి నాలుగైదు ప్రతిపాదనలు అందజేశామన్నారు. ఈ భేటీలో ఎన్ఎండిసీ లేదా “సెయిల్” లో విలీనం చేసే కొన్ని ప్రతిపాదనలు కూడా చేసినట్టు తెలిపారు. ఐపీవో ద్వారా నిధుల సేకరణ చేయాలని కోరామన్న ఆమె.. హామీ లేని రుణాల సేకరణ కోసం ప్రభుత్వ బాండ్లు జారీ చేయాలని విజ్ఞప్తి చేశామన్నారు. తమ ప్రతి పాదనలను సీరియస్ గా పరిశీలిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారని తెలిపిన పురంధేశ్వరి.. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి ఎలాంటి గడువు లేదు.. పరిశీలిస్తామని మాత్రం హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే, పురంధేశ్వరి నోటి వెంట భరోసా కల్పించే మాట వస్తుందనుకుంటే… ఆ స్థాయిలో హామీ దొరకలేదని స్టీల్ ప్లాంట్ కేంద్రంగా ఆందోళన చేస్తున్న వర్గాలు వాపోతున్నాయి.
ఎర్రన్నల పార్టీ ఏమంటోందంటే…
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం ఏపీకి ప్రమాదకరమని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు వ్యాఖ్యానించారు. బీజేపీ తన మిత్రులకు లాభం చేకూర్చే నిర్ణయాలను తీసుకుంటుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ అమ్మకాలకు పెట్టిందని విమర్శించారు. కేంద్రం ప్రకటించిన ప్రకారం 300 ప్రభుత్వ సంస్థలు ఉన్నాయని, ఎవరూ కొనుగోలు చేయకపోతే మూసేస్తామని అంటున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రతిపాదనల నేపథ్యంలో మళ్లీ విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు నినాదంతో వెళ్లాలని రాఘవులు పిలుపునిచ్చారు.