రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు ఇచ్చామనీ, ఆ హామీల్లోనే పోలవరం ప్రాజెక్టు ఉందని అన్నారు. విభజన హామీల అన్నీ కేంద్రం అమలు చేయాలన్నారు. ఏపికి ఒకే రాజధాని ఉండాలనీ, మూడు రాజధానుల ఆలోచన మంచిది కాదని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తే ఏపికి ప్రత్యేక హోదా ఇస్తామని, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అమరావతి రైతుల పాదయాత్రకు మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు.
భారత్ జోడో యాత్రకు మంచి స్పందన వస్తొందనీ, యాత్ర ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నానని అన్నారు రాహుల్ గాంధీ. కాంగ్రెస్ పట్ల ఏపి ప్రజల వైఖరి మారుతుందని చెప్పారు. పాదయాత్రలో వస్తున్న స్పందన చూస్తుంటేనే అది అర్ధమవుతోందన్నారు. ఇక ఎన్నికల్లో పొత్తుల అంశం తన పరిధిలోనిది కాదన్నారు. పార్టీ అధ్యక్షుడితే తుది నిర్ణయమని పేర్కొన్నారు. ఖర్గే, శశిథరూర్ లు అనుభవజ్ఞులని వారికి తన సలహాలు అవసరం లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాల జలవివాదాల పరిష్కారం చూపేందుకు యంత్రాంగం ఉందని రాహుల్ అన్నారు.
కాంగ్రెస్ పార్టీలోనే ప్రజాస్వామ్యం ఎక్కువ ఉంటుందని రాహుల్ అన్నారు. కాంగ్రెస్ లో తప్ప ఏ పార్టీలోనూ బహిరంగంగా నేతలు తమ అభిప్రాయాలు, అసంతృప్తిని వ్యక్తం చేయరని అన్నారు. అధ్యక్ష ఎన్నికలు ప్రజా స్వామ్యబద్దంగా జరిగాయని చెప్పారు. దేశ ఆర్ధిక వ్యవస్థను బీజేపీ విధానాలు నాశనం చేశాయని విమర్శించారు. ఉపాధి అవకాశాలు కరువయ్యాయనీ, రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని అన్నారు. జీఎస్టీ వల్ల ప్రజలపై మరింత భారం పడిందన్నారు. బలవంతంగా పన్నులను రుద్దిందని ఆయన పేర్కొన్నారు.
ఖర్గే ఘన విజయం .. 24 ఏళ్ల విరామం తర్వాత గాంధీ కుటుంబేతర నేత కాంగ్రెస్ బాస్ గా ఎన్నిక