Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందనీ, దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా, రాయలసీమల్లో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. ఏపి వ్యాప్తంగా చాలా ప్రదేశాల్లో చెదురుమదురు గా వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. కోస్తాలో తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది.
మత్స్యకారులు వేటకు వెళ్లే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి వర్షం కురుస్తుందని వెల్లడించింది. ఇప్పటికే హైదరాబాద్ లో శుక్రవారం పలు చోట్ల వర్షం కురిసింది. వాతావరణ పరిస్థితుల వల్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు సూచించారు. వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలకు నీరు చేరే అవకాశం ఉన్నందున తగు చర్యలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.