ఏపీ కి మరో సారి రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఆగ్నేయ బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోందనీ, ఇది చెన్నైకి 670 కిలో మీటర్ల దూరంలో కేంద్రీకృతమైందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీవ్ర అల్పపీడనంగా మారి రాబోయే 48 గంటల్లో తమిళనాడు, దక్షిణ కోస్తాంధ్ర వైపు కదిలే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ధ్రోణి ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ప్రకాశం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. చిత్తూరు, వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాల్లో కూడా భారీ వర్షాలు పడతాయనీ, దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమలో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. మంగళవారం వరకూ మత్య్సకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.
భారత వాతావరణ శాఖ (ఐఎండీ) కూడా రాబోయే రెండు రోజుల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గత నెలలో కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లోని రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. ఇప్పుడు మరో సారి వర్ష హెచ్చరిక జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో తెరిపి ఇచ్చినట్లే ఇచ్చి మరల వర్షాలు కురిసాయి. ఈ ఏడాది భారీ వర్షాలకు అనంతపురం అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే.