Rajya Sabha: మరో రెండు నెలల్లో ఖాళీ అవ్వనున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఏపికి చెందిన నాలుగు రాజ్యసభ స్థానాలు జూన్ నెలలో ఖాళీ అవుతున్నాయి. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి మార్చి నెలలోనే నోటిపికేషన్ విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఖాళీ అవ్వనున్న నాలుగు రాజ్యసభ స్థానాలు వైసీపీకే దక్కుతాయి. ఖాళీ అయ్యే స్థానాల్లో ఒకటే వైసీపీ కాగా మిగిలిన మూడు స్థానాలు నైతికంగా టీడీపీకి చెందినవి. సాంకేతికపరంగా బీజేపీవి. సుజనా చౌదరి, టీజీ వెంకటేష్ లు బీజేపీ తరపున రాజ్యసభకు ఎన్నికైనప్పటికీ మరో ఇద్దరు రాజ్యసభ సభ్యులతో బీజేపీలో విలీనం అయిన కారణంగా వీరు బీజేపీ రాజ్యసభ సభ్యులుగానే రిటైర్ అవుతున్నారు. నాడు టీడీపీ యూపీఏలో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో బీజేపీకి చెందిన సురేష్ ప్రభును రాజ్యసభకు కేంద్ర పెద్దల సూచనల మేరకు నామినేట్ చేసింది. జూన్ నెలలో పై ముగ్గురుతో పాటు వైసీపీకి చెందిన విజయసాయి రెడ్డి ల పదవీ కాలం పూర్తి అవుతోంది.
Rajya Sabha: విజయసాయిరెడ్డికి రెన్యువల్ ..?
అయితే విజయసాయిరెడ్డికి సీఎం జగన్ మరో సారి రెన్యువల్ చేసే అవకాశం ఉందని వార్తలు వినబడుతున్నాయి. ఎమ్మెల్సీ పదవు కేటాయింపులోనూ వైసీపీ సామాజిక వర్గాల సమీకరణ పాటించిన నేఫథ్యంలో ఇప్పుడు రాజ్యసభ సభ్యుల ఎంపిక విషయంలోనూ అదే ఫార్మలా పాటిస్తుందని అనుకుంటున్నారు. విజయసాయి రెడ్డికి రెన్యువల్ చేస్తే రెడ్డి సామాజిక వర్గ భర్తీ అయినట్లు అవుతుంది. ఇక మిగిలింది ఎస్సీ, బీసీ, మైనార్టీ సామాజికవర్గాల నుండి ఎంపిక చేయవచ్చు. మిగిలిన మూడు స్థానాలకు జాక్ పాట్ కొట్టే నాయకులు ఎవరు అనే దానిపై వైసీపీ లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి జగన్ ఆఫర్ ఇచ్చారని వార్తలు వచ్చినప్పటికీ తను రాజకీయాలకు దూరంగా ఉన్నాననీ, అటువంటి చర్చ ఏమీ జరగలేదనీ చిరంజీవి క్లారిటీ ఇవ్వడంతో కాపు సామాజికవర్గం నుండి ముద్రగడ పద్మనాభం ఒప్పుకుంటే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
వైవీ సుబ్బారెడ్డి సైతం
2019 ఎన్నికలకు ముందు జగన్మోహనరెడ్డి పలువురు నేతలకు రాజ్యసభ హామీలు ఇచ్చి ఉన్నారు. వారంతా ఆశతో ఎదురుచూస్తున్నా కానీ సామాజిక సమీకరణాల నేపథ్యంలో సాధ్యం అవ్వకపోవచ్చని నిరుత్సాహపడుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఎంపీ సీటు త్యాగం చేసిన వైవీ సుబ్బారెడ్డికి రాజ్యసభ పదవిపై ఆశ ఉంది. అందుకే ఆయన అయిష్టంగా రెండో సారి టీటీడీ చైర్మన్ పదవి బాధ్యతలను చేపట్టారు. ఇప్పుడు రాజ్యసభకు సీఎం జగన్ ఓకే చెబితే టీటీడీ చైర్మన్ పదవిని వదులుకోవడానికి సైతం వైవీ సిద్దంగా ఉన్నట్లు సమాచారం. గతంలో మోహన్ బాబు పేరు వినబడినప్పటికీ ఇప్పుడు సీఎం జగన్ దూరం పెట్టినట్లు వార్తలు వినబడుతున్నాయి. కొద్ది నెలల క్రితం సీఎం జగన్ కు కలిసేందుకు విజయవాడ వరకూ కూడా వచ్చి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో మోహన్ బాబు వెనుతిరిగి వెళ్లిపోయారని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.
కళారంగం, మైనార్టీ కోటాలో ఆలీ
ఇక ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం చేసిన నటుడు ఆలీ కూడా రాజ్యసభ రేస్ లో ఉన్నట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడినా జగన్ అవకాశం ఇవ్వలేదు. ఇప్పుడు పరిశీలించే అవకాశం ఉంది. పార్టీ కోసం అన్ని రకాలుగా ఉపయోగపడేవారికే ప్రయారిటీ ఇవ్వాలని కొందరు సీనియర్ నేతలు కోరుతున్నారు. శ్రీకాకుళం జిల్లా నుండి కిల్లి కృపారాణి, గుంటూరు జిల్లా నుండి మర్రి రాజశేఖర్ పేర్లు కూడా వినబడుతున్నాయి. అయితే సీఎం జగన్మోహనరెడ్డి మనసులో ఎవరు ఉన్నారనేది నోటిఫికేషన్ విడుదల అయిన తరువాతే వెల్లడవుతుందని భావిస్తున్నారు.