Ramateetham: టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజుపై నెల్లిమర్ల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. విజయనగరం జిల్లా రామతీర్ధంలో బోడికొండపై శ్రీకోదండ రామాలయం శంకుస్థాపన కార్యక్రమం వద్ద జరిగిన నిన్న జరిగిన ఘటనను పురస్కరించుకుని ఆలయ ఇఓ ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుపై వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజుపై కేసు నమోదు చేశారు. గతంలో రామతీర్ధం కోదండ రామాలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆలయంలో ఆలయ పునః నిర్మాణానికి ప్రభుత్వం మూడు కోట్లు మంజూరు చేసింది. బుధవారం శంకుస్థాపన భూమి పూజ కార్యక్రమం జరిగింది. అయితే ఆలయ వంశపారంపర్య ధర్మకర్త అశోక్ గజపతిరాజు ప్రొటోకాల్ ఉల్లంఘనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడ ఏర్పాటు చేసిన శంకుస్థాపన బోర్డును తొలగింపుకు ప్రయత్నించారు.
Ramateetham: ఐపీసీ సెక్షన్ 473,353 కింద కేసు నమోదు
దీంతో అక్కడ తోపులాట జరిగింది. వైసీపీ కార్యకర్తలు, అధికారులకు, అశోక్ గజపతిరాజు మధ్య వాగ్వివాదం చోటుచేసుకుంది. అనంతరం మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ తదితర ప్రముఖులు హజరై భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తరువాత మీడియాతో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును అశోక్ గజపతిరాజు, అశోక్ గజపతిరాజు వ్యవహరించిన తీరుపై మంత్రులు బొత్సా సత్యనారాయణ, వెల్లంపల్లి శ్రీనివాస్ లు విమర్శలు, ప్రతివిమర్శలు చేసుకున్నారు. అయితే ఇక్కడ జరిగిన ఘటనపై ఆలయ ఇఓ ప్రసాద్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా అశోక్ గజపతిరాజు పై ఐపీసీ సెక్షన్ 473,353 కింద కేసు నమోదు చేశారు. కాగా అక్కడ జరిగిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి రాజును అవమానించడాన్ని ఖండించారు.