Raptadu : ఏపిలో స్థానిక పంచాయతీ ఎన్నికల మొదటి దశ నామినేషన్ ల స్వీకరణ పర్వం నేటి నుండి ప్రారంభం అయ్యింది. రాజకీయాలకు అతీతంగా పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నప్పటికీ అధికార వైసీపీ తన సత్తా చాటి రాష్ట్రంలో తమ బలం తగ్గలేదు అని నిరూపించుకునే పనిలో ఉంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఏకగ్రీవాలపై దృష్టి సారిస్తున్నారు. మరో పక్క గ్రామాల్లో బలమైన అభ్యర్థులను రంగంలో దించేందుకు వ్యూహత్మకంగా పావులు కదుపుతున్నారు. ఈ క్రమంలోనే అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఓ మేజర్ గ్రామ పంచాయతీని హస్తగతం చేసుకునేందుకు అక్కడి వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యూహత్మకంగా అభ్యర్థి ఎంపిక చేశారు.
రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గ్రామ వాలంటీర్ వ్యవస్థ తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ వాలంటీర్లు నిత్యం తమ పరిధిలోని లబ్దిదారులకు నేరుగా ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేయడం, ఆ కుటుంబాలతో సన్నిహితంగా వ్యవహరిస్తూ వారికి అవసరమైన ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందే విధంగా చూడటం లాంటి పనులు చేస్తున్నారు. ప్రభుత్వ పథకాలు లబ్దిదారులకు అందే విషయంలో గ్రామాల్లో వాలంటీర్లు కీలక భూమిక పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు రావడంతో రాప్తాడు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఓ వాలంటీర్ ను మేజర్ గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
నియోజకవర్గ పరిధిలోని ప్రసన్నాంజనేయపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా ఆ గ్రామ వాలంటీర్ సత్యవతిని వైసీపీ బలపర్చిన అభ్యర్థిగా రంగంలోకి దింపారు. అయితే స్థానిక పంచాయతీ ఎన్నికల విధులలోనే వాలంటీర్ లు పాల్గొనడానికి వీలు లేదని ఇంతకు ముందే ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ నేపథ్యంలో వాలంటీర్ పోటీ చేయడానికి రాష్ట్ర ఎన్నికల సంఘం అంగీకరిస్తుందా లేదా అన్న దానిపై ఇప్పుడు చర్చ జరుగుతోంది.