Chalo Vijayawada: పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగులు చేపట్టిన ‘చలో విజయవాడ’ కార్యక్రమానికి పోలీసులు అనుమతులు నిరాకరించారు. ఇందులో భాగంగా అన్ని జిల్లాల్లోని ఉద్యోగ సంఘాల నేతలను గృహనిర్బంధం చేస్తూ.. కార్యక్రమానికి వెళ్లొదని నోటీసులు జారీ చేస్తున్నారు. కార్యక్రమానికి ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో ఉద్యోగులను ఎక్కడికక్కడే అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ఉద్యోగ సంఘాల నాయకుల ఇళ్ల చిరునామాలు సేకరిస్తున్నారు. అంతేకాకుండా.. విజయవాడ వెళ్లే వారి వివరాలు సేకరించాలని వాలంటీర్లకు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు ఉద్యోగ సంఘాలు ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.
అన్ని జిల్లాల్లో..
కృష్ణా జిల్లాలోని నందిగామ, కంచికచర్ల ప్రాంతాల్లోని ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి కార్యక్రమానికి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. నాయకులు పోలీస్ స్టేషన్ రావాలని నందిగామ డీఎస్పీ కోరారు. గుంటూరు జిల్లాలో కూడా పోలీసుల ఆంక్షలు విధించారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నాయకులను గృహనిర్బంధం చేశారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఉద్యోగ సంఘ నాయకులకు పోలీసులు ఫోన్లు చేసి కార్యక్రమానికి వెళ్లొద్దని హెచ్చరికలు చేశారు. అయితే.. ఉద్యోగ సంఘాల నాయకులు నిన్న రాత్రికే విజయవాడకు చేరుకున్నట్టు తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు ఎన్జీవో అధ్యక్షుడు కామిశెట్టి రాంబాబును గృహనిర్భంధం చేశారు. తుని జాతీయ రహదారిపై చెక్పోస్టు ఏర్పాటు చేసి ఉద్యోగ సంఘాల నాయకులను విజయవాడకు వెళ్లకుండా నియంత్రిస్తున్నారు.
ఉద్యోగులను హౌస్ అరెస్ట్..
చలో విజయవాడకు అనుమతి లేదని విశాఖ జిల్లా ఉద్యోగులకు సమాచారం ఇస్తున్నారు పోలీసులు. విజయనగరంలో పోలీసుల ముందస్తు చర్యలు చేపట్టి.. బొబ్బిలిలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి విజయగౌరిని గృహ నిర్బంధం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి ఉద్యోగులు మధ్యాహ్నం నుంచి బయల్దేరేందుకు ఏర్పాట్లు చేసుకోగా.. కొవిడ్ దృష్ట్యా విరమించుకోవాలని పోలీసులు సూచించారు. చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల నేతల ఇళ్లకు వెళ్లి గృహనిర్బంధం చేశారు. నెల్లూరు జిల్లాలో నెల్లూరు, గూడూరు, వాకాడు, వరికుంటపాడులో నేతలను ముందస్తు అరెస్టు చేశారు. పీఆర్సీ సాధన సమితి నేత చేజర్ల సుధాకర్రావు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సర్వత్రా ఉత్కంఠ..
అనంతపురం నుంచి విజయవాడకు వెళ్లే మార్గంలో పోలీసుల మోహరించారు. బుక్కరాయసముద్రం, నార్పల క్రాస్ వద్ద పోలీసులు తనిఖీలు చేపడుతున్నారు. హిందూపురంలో ఎన్జీవో నేత నరసింహులును గృహనిర్భంధం చేశారు. ప్రకాశం జిల్లాలో చలో విజయవాడకు వెళ్తున్న ఉద్యోగ సంఘాలకు కొవిడ్ నిబంధనలు ఉన్నందున అనుమతి లేదని నోటీసులు ఇచ్చారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శరత్ను ఒంగోలులో గృహనిర్బంధం చేశారు. మొత్తంగా ప్రభుత్వం ఆంక్షలు, పోలీసుల ముందస్తు చర్యలతో రేపటి కార్యక్రమంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.