Pegasus: పెగాసెస్ స్పైవేర్ నిఘా అంశం ఇప్పుడే దేశంలో హాట్ టాపిక్ మారిన సంగతి తెలిసిందే. దేశంలో 300లకు పైగా ప్రముఖుల ఫోన్ లపై నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియాలో వచ్చిన కథనం తీవ్ర సంచలనం అయ్యింది. ఈ అంశంపై పార్లమెంట్ ఉభయ సభల్లో విపక్షాలు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ప్రధాన అంశాలపై చర్చ జరగకుండా సభలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే. ఈ అంశాలకు సంబంధించి ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్ అధికారి, లోక్ సత్తా పార్టీ అధినేత జయప్రకాశ్ నారాయణ స్పందించారు.
పాలకపక్షాలు నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం ఇది కొత్త ఏమి కాదన్నారు. నిఘాకు చట్టబ్దదంగా కట్టుబాట్లు ఉండాలి. న్యాయవ్యవస్థ నుండి ముందస్తు అనుమతులు తీసుకుని కొన్ని చట్టబద్ద పద్ధతులు పాటించాల్సి ఉంటుందన్నారు. పాలనలో ఉన్న అన్ని పార్టీలు ఏ రకమైన న్యాయపరమైన అనుమతులు లేకుండా చట్టంతో నిమిత్తం లేకుండా ఇష్టం వచ్చినట్లు వేలాది ఫోన్ల మీద నిఘా వేస్తున్నారని అన్నారు. పూర్వంతో పోలిస్తే టెక్నాలజీ మరింత పెరిగింది కాబట్టి నిఘా వేసే పద్దతులు మరింత బలపడ్డాయన్నారు. నిఘా వేయడంతో మరింత పట్టు ఉన్న పద్ధతులు ఇప్పుడు దొరికాయన్నారు. ప్రభుత్వాలు నేరాలను అరికట్టడానికి, దేశ సమగ్రత కాపాడటానికి ప్రభుత్వానికి అధికారాలు ఉండాలి లేకుంటే అరాచకత్వం వస్తుంది. ఇదే సమయంలో వ్యక్తుల స్వేచ్చను హరించకుండా అధికార దుర్వినియోగం లేకుండా జవాబుదారి తనంతో వ్యవహరించాలన్నారు. న్యాయవ్యవస్థ నిరంతరం పరిశీలించి స్పష్టమైన ఆధారాలతో చట్టంలో ఏ ఏర్పాట్లు ఉన్నాయి, వాటిని పాటిస్తున్నామా లేదా వాటికి ఎలాంటి చట్టాలను ఏర్పాటు చేద్దాం అనే వాటిపై చర్చ జరిగితే సంతోషించవచ్చని అన్నారు. ఇటువంటి చర్చ జరపడానికి అధికార పక్షానికి ఇష్టం లేదు, ప్రతిపక్షానికి ఇష్టంలేదనీ, నీవు చేశారు కదా అంటే నీవు చేశావు కదా అంటూ ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవడం జరుగుతుందన్నారు. ఎదో ఒక సమస్యను పట్టుకుని పది రోజుల పాటు గందరగోళం చేయడం తప్ప ప్రయోజనం ఏమీ ఉండదన్నారు.
దేశంలో కీలకమైన సమస్యలను విస్మరించి సామాన్యులకు అర్థంకాని పెగాసెస్ ను పట్టుకుని పది రోజుల పాటు ఆందోళనలు చేయడం వల్ల ఎటువంటి లాభం ఉండదని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రజారోగ్యాన్ని ఎలా బాగు చేయాలి, గత ఏడాది తీసుకువచ్చిన కొత్త విద్యా విధానంపై జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ఏలా అమలు చేయాలి, అదే విధంగా ఆర్థిక వ్వసస్థ కూదేలైపోయింది, పెట్టుబడులు పెంచాలి, ఉపాధి అవకాశాలు పెరగాలి, నిరుద్యోగ యువతకు ఉపాధి కావావి తదితర కీలక అంశాలపై ఉభయ సభల్లో అర్థవంతమైన చర్చ జరగాలి కానీ ఇలా ఒకళ్లపై ఒకళ్లు ఆరోపణలు, విమర్శలు చేసుకోవడం తిట్టుకోవడం సరికాదని జయప్రకాష్ నారాయణ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.