Visakha Steel Plant : విశాఖ ఉక్కు ..ఆంధ్రుల హక్కు నినాదంతో ఏర్పడిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ చేయవద్దంటూ ఓ పక్క పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్న విషయం తెలిసిందే. కార్మికుల ఉద్యమానికి వివిధ రాజకీయ పక్షాలు మద్దతు ఇస్తున్నాయి. ఓ పక్క కార్మికుల ఉద్యమానికి మద్దతు తెలియజేస్తూ మరో పక్క న్యాయపోరాటానికి సిద్దమైయ్యారు మాజీ సీబీఐ జేడీ వివి లక్ష్మీనారాయణ. కేంద్ర కేబినెట్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయాన్ని నిలుపుదల చేయాలని కోరుతూ ఆయన హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా పరిశ్రమను లాభాల బాట పట్టించవచ్చనీ ప్రైవేటీకరణ సమస్యకు పరిష్కారం కాదనీ ఆయన పిటిషన్ లో పేర్కొన్నారు.
ఇంతకు ముందే వివి లక్ష్మీనారాయణ ఈ అంశంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి లేఖ కూడా రాశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ను నష్టాల నుండి లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఆయన పంపిన లేఖలో పేర్కొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు లక్ష్మీనారాయణ గత కొద్ది రోజులుగా కార్మిక సంఘాల నేతలు, వివిధ రాజకీయ పక్షాల నేతలతో సమావేశాలను నిర్వహిస్తూ చర్చిస్తున్న సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణ దాఖలు చేసిన పిల్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు.