Revanth Reddy : రేవంత్ రెడ్డి … ఎంపీ, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. తెలంగాణలోని ఫైర్ బ్రాండ్ రాజకీయ నేతల్లో ఆయనొకరు. సొంత పార్టీలోనే కొందరు నేతలతో పొసగక పోయినా… తన పంథాలో తాను ముందుకు సాగుతున్నారు.
రాజీవ్ రైతు భరోసాయాత్ర పేరుతో పాదయాత్ర నిర్వహించిన రేవంత్ రెడ్డి ఆ వెంటనే బ్రేక్ ఇవ్వకుండా తన కార్యక్రమాల్లో బిజీ అయిపోతున్నారు. తాజాగా ఢిల్లీలో భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేష్ టికాయత్ను కలిశారు. రైతుల దీక్షకు సంఘీభావం తెలిపిన రేవంత్రెడ్డి.. తెలంగాణలో రైతు సమస్యలపై ఉద్యమించేందుకు రాకేష్ టికాయత్ను ఆహ్వానించారు.
అసలు ఏంటి రేవంత్ Revanth Reddy ప్లాన్?
దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన రైతు ఉద్యమంలో ఎంట్రీ ఇచ్చిన రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుత చట్టాలను ఉపసంహరించుకుని రైతు అనుకూల నూతన చట్టాలను తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షా బేషాజాలకు పోకుండా నూతన చట్టాలను తీసుకురావాలని ఎంపీ ఎంపీ రేవంత్రెడ్డి కోరారు. ప్రధాని మోడీ పక్కన చేరి జోడి కట్టిన కేసీఆర్.. తెలంగాణ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్, ప్రధాని నరేంద్ర మోడీల మధ్య జరిగిన అవగాహన ఒప్పందం ప్రకారం కొనుగోలు కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించిందని మండిపడ్డారు.
జెండాలు పక్కనపెట్టేయండి…
“రాజీవ్ రైతు భరోసాయాత్ర,” “రైతు రణభేరి”ల ద్వారా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన చట్టాలపై ఉద్యమించామని రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణలో ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లడానికి రాకేష్ టికాయత్ లాంటి రైతు సంఘాల నేతలను ఆహ్వానించామన్నారు. తెలంగాణలో రైతులు, కులవృత్తుల సమస్యలపై ఉద్యమించాల్సిన అవసరాన్ని ఆయనకు వివరించినట్టు తెలిపిన రేవంత్.. తెలంగాణలో రైతులకు అండగా నిలిచేందుకు మార్చి మొదటి వారంలో రైతు సంఘాలు తలపెట్టిన బహిరంగ సభకు రాకేష్ టికాయత్ను ఆహ్వానించామని ఆయన ఆమోదం కూడా తెలిపారన్నారు. రాజకీయ పార్టీలకు అతీతంగా రైతు సమస్యలపై నిర్వహించబోతున్న బహిరంగ సభకు జెండాలు, అజెండాలు పక్కన పెట్టి కలసిరావాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.