Revanth Reddy: తెలంగాణ కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ నేత, మల్కాజ్గిరి ఎంపీ రేవంత్ రెడ్డి తన రూటు మార్చుకున్నారా? సంచలన కామెంట్లకు పెట్టింది పేరయిన ఈ యువ నేత తన పంథాకు భిన్నంగా కరోనా విలయం కొనసాగుతున్నందున గొప్ప మనసు చాటుకుంటున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకదాని తర్వాత ఒకటి అన్నట్లుగా రేవంత్ రెడ్డి తీసుకుంటున్న నిర్ణయాలు ఈ విశ్లేషణలకు కారణంగా మారుతున్నాయి.
ముందు అక్కడ … ఆ తర్వాత ఇక్కడ…
కరోనా కల్లోలం సమయంలో తనవంతుగా సేవ చేయాలని భావించిన రేవంత్ రెడ్డి గాంధీ ఆస్పత్రి వద్ద ఉచితంగా భోజన సదుపాయం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయం ద్వారా ఆయన పలువురు మనసులు గెలుచుకున్నారు. దానికి కొనసాగింపుగా మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల కోసం ఎంపీ రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీ 50 పడకల కరోనా ఆస్పత్రిగా మార్చి చికిత్స అందించాలని ఎంపీ రేవంత్ రెడ్డి డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగా కంటోన్మెంట్ బొల్లారం పీహెచ్సీ దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు మొత్తం సిద్ధం చేశారు.
20 రోజులుగా…
మల్కాజ్గిరి నియోజకవర్గ ప్రజలకు కరోనా చికిత్స అందించేందుకు ఆస్పత్రిని దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి తన సొంత నిధులు, ఎంపీ నిధులు ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఇందుకు తగిన పనులు మొదలుపెట్టారు. ఇందులో భాగంగా తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని ప్రజల కోసం 50 ఆక్సిజన్ బెడ్ల సామర్థ్యంతో కంటోన్మెంట్ బొల్లారం కోవిడ్ ఆస్పత్రిని ప్రారంభిస్తున్నట్లు ఎంపి రేవంత్ రెడ్డి ప్రకటించారు. 100 ఆక్సిజన్ పడకల సామర్థ్యంతో పూర్తి స్థాయి కరోనా చికిత్స ఆస్పత్రి త్వరలో ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించడం గమనార్హం. దూకుడుగా ఉండే రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయంపై టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ టీం ఎలా స్పందిస్తుందో మరి!