Road Accident: కడప జిల్లా బ్రహ్మంగారిమఠం మండలం డి అగ్రహారం సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నెల్లూరు జిల్లాకు చెందిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మైదుకూరు – బద్వేలు జాతీయ రహదారిపై లారీ, కారు ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని క్షతగాత్రులను కడప సర్వజన ఆసుపత్రికి తరలించారు.
మృతులు నెల్లూరు జిల్లా అనంత సాగరం మండలానికి చెందిన రేష్మ, సద్దామ్ హుస్సేన్, సాల్మ, సాయిలుగా పోలీసులు గుర్తించారు. వీరంతా కర్ణాటక నుండి ఇన్నోవా కారులో వస్తుండగా టమాటా లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. మృతదేహాలను బద్వేలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.